హైకోర్టు రగడ: మరో 4గురి సస్పెన్షన్, కేసీఆర్కు తెలియదా.. కొనకళ్ల
హైదరాబాద్/ఢిల్లీ: హైకోర్టు విభజన, ఆప్షన్ వివాదం ముదురుతోంది. తాజాగా, గురువారం నాడు రంగారెడ్డి జిల్లా న్యాయశాఖలో పనిచేసే నలుగురు ఉద్యోగులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్టులో అతిగా ప్రవర్తించారనే కారణంతో వారి పైన వేటు వేసింది.
రంగారెడ్డి జిల్లాలో నలుగురు ఉద్యోగులు.. శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి, కృష్ణయ్య, రతన్ రాజ్లు పని చేస్తున్నారు. హైకోర్టు విభజనను డిమాండ్ చేస్తూ వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం వారు కోర్టులో అతిగా ప్రవర్తించినట్లు హైకోర్టు పేర్కొంది.
న్యాయం, కోర్టుల ప్రజల ప్రజలకు విశ్వాసం ఉందని, అది పోయేలా ప్రవర్తించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సస్పెన్షన్లకు తాము ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని, హైకోర్టు విభజన జరిగే వరకు ఇలాగే పోరాడుతామని న్యాయశాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
కాగా, శుక్రవారం నుండి న్యాయశాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. ఇప్పటికే పెన్ డౌన్ ప్రకటించారు. మరోవైపు, సోమవారం నాడు ఇద్దరు న్యాయాధికారులను, మంగళవారం నాడు తొమ్మిది మంది న్యాయాధికారులను.. మొత్తం 11 మందిని హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఉండాలనేం లేదు: కొనకళ్ల
తమకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనే కోరిక ఏమాత్రం లేదని టిడిపి ఏపీ ఎంపీ కొనకళ్ల నారాయణ గురువారం నాడు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. అసలు, జడ్జిల నియామకం ఎలా జరుగుతుందో తెలంగాణ కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు.