ఆదేశాలు ఖతరు చేయరా..? జూన్ 8వ నుంచి ఒక్క ఉత్తర్వు అమలు చేయలే: తెలంగాణ హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసుల విషయంలో కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖతరు చేయలేదు అని మండిపడ్డారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ పిటిషన్లు దాఖలు కాగా.. హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 8వ తేదీనుంచి ఇచ్చిన ఒక్క ఉత్తర్వును కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Recommended Video
కరోనా వైరస్ గురించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు లెక్కచేయలేదు అని ప్రశ్నించింది. దీనికి అధికారులు సమాధానం చెప్పాలని కోరింది. తమ ఆదేశాలపై నిర్లక్ష్యం చూపడం విచారకరమని ధర్మాసనం మండిపడింది. దీంతోపాటు కరోనా వైరస్ కేసుల వివరాలతో ఆరోగ్యశాఖ విడుదల చేస్తోన్న బులెటిన్ సమాచారం సరిగా లేదని అభిప్రాయపడింది. దీనిపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరాలు కోరతామని తెలిపింది. కరోనా కేసులపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలతో ఆదివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నమూనాలో కరోనా బులెటిన్ వెల్లడిస్తుంది. కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతంలో కూడా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవలే కూడా న్యాయస్థానం తీవ్ర పదజాలంతో హెచ్చరించింది. ఇదే చివరి అవకాశమని, తమ సహనాన్ని పరీక్షించొద్దని స్పష్టంచేసింది.
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఎక్కువ కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందుతున్న తీరుపైనా అసంతృప్తి వెళ్లగక్కింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆదివారం నుంచి కరోనా బులెటిన్లో మార్పులు కొత్త తరహాలో ఇస్తోంది. అయినా దీనిలో కూడా సరైన వివరాలు లేవని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే పదే పదే హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.