వైసీపీ నేత పీవీపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట: అప్పటిదాకా ముందస్తు బెయిల్ గడువు పెంపు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఆయనపై నమోదైన కేసులో పీవీపీ అరెస్టును ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ముందస్తు బెయిల్ను పొందారు. ఈ బెయిల్ గడువు రెండు రోజుల్లో ముగియాల్సి ఉండగా.. దాన్ని పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
అలా విడుదల..ఇలా వివాదం: పోలీసులపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి: ఘాటు పదాలతో
బంజారాహిల్స్లో నివాసం ఉంటోన్న పీవీపీ ఓ విల్లా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన ఇంటికి వెనుక ఉన్న విల్లాపై రూఫ్ గార్డెన్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన కైలాష్ విక్రమ్ అనే వ్యక్తిపై పీవీపీ దౌర్జన్యానికి దిగారు. తన అనుచరులతో కలిసి కైలాష్ విక్రమ్ ఇంటిపై దాడి చేశారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇంట్లో వస్తువులను చిందరవందర చేశారు. దీనిపై బాధితుడు కైలాష్ విక్రమ్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
ఈ కేసులో ఆయనను అరెస్టు చేయాల్సి ఉండగా.. పీవీపీ ముందస్తు బెయిల్ను పొందారు. దీని గడువు రెండు రోజుల్లో ముగియాల్సి ఉంది. ఈలోగా మరోసారి పీవీపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పీవీపీ తరఫున ప్రముఖ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మరో పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ గడువును పొడిగించింది. ఈ నెల 18వ తేదీ వరకు గడువును పెంచింది. అప్పటివరకూ పీవీపీని అరెస్టు చేయవద్దని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.