శివాజీకి హైకోర్టులో ఊరట.. అమెరికా వెళ్లడానికి ఓకే..! విచారణకు ముందు అక్కడికెందుకు ?
హైదరాబాద్ : సినీ నటుడు శివాజీని మరోసారి కనికరించింది తెలంగాణ హైకోర్టు. అలంద మీడియా గ్రూప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో అతడు అమెరికా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. జులై చివరలో ఇలాగే న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో అమెరికా వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు శివాజీ. తాజాగా మరోసారి హైకోర్టు ఓకే చెప్పడంతో గురువారం నాడు అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
జులై 24వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 25వ తేదీన శివాజీ అమెరికా వెళ్లే క్రమంలో పోలీసులు ఇబ్బందులు పెట్టలేదని వారి తరపున వాదిస్తున్న న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ క్రమంలో పోలీసులు తనను ఆపారంటూ శివాజీ తరపు న్యాయవాది వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే విషయం పోలీసుల తరపు వాదిస్తున్న లాయర్ న్యాయస్థానానికి వివరించారు. ఆ సమయంలో హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత లుకౌట్ నోటీసులు తొలగించడానికి మూడు రోజులు పడుతుందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు సీఐడీకి వెళ్లి అక్కడినుంచి ఇమిగ్రేషన్కు వెళ్లాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. ఇండియాలో శివాజీని ఎవరూ అడ్డుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
కోతి పనులు చేయకురా వెధవ.. బట్టలుతికే మంకీని చూస్తే ఇకపై అలా అనరేమో (వీడియో)
దుబాయ్ ఇమిగ్రేషన్ సిబ్బంది మాత్రం శివాజీని నిలువరించారని తెలిపారు. అయితే శివాజీ, పోలీసుల తరపున వాదనలు విన్న హైకోర్టు.. ఇదంతా సమాచార లోపం వల్ల జరిగిన తప్పిదమని నిర్ధారించింది. దాంతో గురువారం (08.08.2019) నుంచి మూడు వారాల పాటు శివాజీ అమెరికా వెళ్లేందుకు మరోసారి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఇటీవల శివాజీ అమెరికా వెళ్తుండగా తనను పోలీసులు అడ్డుకున్నారంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారించి ఆ మేరకు ఈ విధంగా తీర్పు చెప్పింది.
అదలావుంటే అలంద మీడియా కేసులో శివాజీపై జారీ చేసిన లుకౌట్ నోటిసులను తొలగించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించినప్పటికీ.. ఇంతవరకు వాళ్లు చర్యలు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దాంతో జులై చివరివారంలో ఆయన అమెరికాకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు తలెత్తాయని చెప్పుకొచ్చారు. ఇక్కడి పోలీసులు అడ్డుకోవడంతో పాటు దుబాయ్ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అమెరికాకు వెళ్లకుండా వెనక్కి పంపించేశారని వెల్లడించారు. ఇంతవరకు కూడా ఇమిగ్రేషన్ వెబ్సైట్లో ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు తొలగించలేదని.. దీన్ని కోర్టు ధిక్కారణ కింద పరిగణించాలని న్యాయస్థానాన్ని కోరారు.