దారుణం: హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య, నరికి చంపిన దుండగులు
పెద్దపల్లి: జిల్లాలోని రామగిరి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారిపై దుండగులు విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు.
Recommended Video
న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన సతీమణి నాగమణి.. మంథని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్ బంకు సమీపంలో గుర్తు తెలియని దుండగులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు. కారులో ఉన్న వామన్ రావు, నాగమణిపై కత్తులతో దాడి చేసి హత్యచేశారు.
స్థానికులు సమాచారం అందించడంతో 108 వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే న్యాయవాద దంపతులు మృతి చెందారు. అయితే, చనిపోయే ముందు తన హత్యకు కుంట శ్రీనివాస్ అనే వ్యక్తే కారణని వామన్ రావు చెప్పారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఘటన జరిగినప్పుడు అక్కడున్నవారిని ఘటనపై ఆరా తీస్తున్నారు. అయితే, వామన్ రావు గత కొంతకాలంగా పలు వివాదాల్లో జోక్యం చేసుకున్నారని, ఈ క్రమంలోనే హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.వామన్ రావు కారు డ్రైవర్ను పోలీసులు విచారిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. లాయర్ దంపతుల వాహనాన్ని అడ్డగించి నిందితులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. నిందితు కోసం ఆరు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు. అయితే, నిందితుడు కుంట శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
లాయర్ దంపతుల హత్యను హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జీతో ఈ ఘటనపై విచారణ జరిపించాలన్నారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి దీనిపై విన్నవిస్తామని తెలిపారు.