మేం అలా చెప్పలేం: టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు, 12కు వాయిదా
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులను మంగళవారం వరకు పొడిగించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అంతకుముందు హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
కార్మిక శాఖ వద్ద మధ్యవర్తిత్వం ప్రక్రియలో పెండింగ్లో ఉండగానే సమ్మెకు వెళ్లారని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.
ప్రజలు ఇబ్బంది పడుతున్నందున జోక్యం చేసుకోవాలని న్యాయవాది కృష్ణయ్య కోరారు. అయితే, కోర్టులు ఏ కేసునైనా చట్టం ప్రకారమే తేలుస్తాయని, భావోద్వేగాలు, సానుభూతితో తేల్చలేవని హైకోర్టు స్పష్టం చేసింది. చేరితే చేరండి.. లేకపోతే లేదని ప్రభుత్వం కార్మికులకు చెప్పిందని, అంతేగాక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయం తీసుకుందని కోర్టు పేర్కొంది.
సమ్మె చట్ట విరుద్ధమని కార్మిక కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇప్పటి వరకు ప్రకటించలేదని హైకోర్టు తెలిపింది. మరోవైపు చర్చలు జరపాలంటూ ప్రభుత్వాన్ని బలవంతపెట్టే అధికారం తమకు ఎలా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. కాగా, సమ్మెపై కేసుల విచారణ అంశంలో తమకు సహకరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ను హైకోర్టు ధర్మాసనం కోరింది.
ఇది ఇలా ఉండగా, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నెల రోజులకుపైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ నవంబర్ 5వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ కార్మికులు విధుల్లో చేరేందుకు సుముఖత చూపలేదు. తాము వెనక్కి తగ్గేది లేదని కార్మికులు స్పస్టం చేశారు. ఆమరణ దీక్షకు కూడా సిద్ధమవుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా కార్మికులతో చర్చలు జరిపేది లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.