'మర్డర్' విడుదలను నిలిపివేయాలని అమృత పిటిషన్... విచారణకు నిరాకరించిన హైకోర్టు...
మర్డర్ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో అమృత ప్రణయ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. కోర్టును తప్పుదోవ పట్టించారని... తన కథతోనే సినిమా తీశారని అమృత ప్రణయ్ పిటిషన్లో పేర్కొన్నారు. సినిమా విడుదలవకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం అమృత పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది.
మరోవైపు 'మర్డర్' సినిమా ప్రివ్యూను బుధవారం(డిసెంబర్ 23) ప్రదర్శించారు. గురువారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. మర్డర్ సినిమాకు అమృత ప్రణయ్ కథకు ఏ సంబంధం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా ప్రివ్యూ సందర్భంగా దర్శకుడు ఆనంద్ చంద్ర ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పకుడిగా,నట్టి కుమార్ నిర్మాతగా ఆనంద్ చంద్ర దర్శకత్వంలో మర్డర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి ఈ సినిమా మిర్యాలగూడకు చెందిన అమృత-ప్రణయ్ల కథే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అమృత కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ గతంలో నల్గొండ కోర్టులో అమృత పిటిషన్ దాఖలు చేయడంతో సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడక తప్పలేదు. ఎట్టకేలకు కోర్టు వివాదాలను దాటుకుని మర్డర్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాగా,2018లో మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రణయ్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన అమృతను వివాహం చేసుకున్నందుకు ఆమె తండ్రి మారుతీరావు కిరాయి మనుషులతో ప్రణయ్ని హత్య చేయించాడు. ఆ హత్య కేసు విచారణ కొనసాగుతుండగానే మారుతీరావు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంగోపాల్ వర్మ తీసిన మర్డర్ సినిమా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తోందని అమృత ప్రణయ్ వాపోతున్నారు.