రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీం కోర్టుకు వెళ్ళండి ... హైకోర్టు పరిధిలోది కాదన్న ధర్మాసనం
రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఇరు తెలుగురాష్ట్రాల మధ్య జల యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే . జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో విచారణ జరుగుతుంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేడు విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి కేంద్రం అఫిడవిట్ ... తెలంగాణాకు షాక్ ..ఏపీ వాదనకు సమర్ధన
రెండు రాష్ట్రాల జల వివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని ప్రశ్న
రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి, శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే హైకోర్టు ధర్మాసనం రెండు రాష్ట్రాల జల వివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుంది అని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.అంతర్రాష్ట్ర జల వివాదం కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాలి అంటూ హైకోర్టు సూచించింది.
విచారణ రేపటికి వాయిదా
ఈ విషయంపై పిటిషనర్లతో చర్చించి కోర్టుకి తెలియజేస్తామని న్యాయవాది చెప్పడంతో హైకోర్టు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల క్యూసెక్కుల అదనపు నీటిని ఎత్తి పోయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ రాష్ట్రం వాదిస్తోంది. ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డుకు దీనిపై రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ వాదన
రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త పథకం కాదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి వస్తున్న నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకుంటున్నామని, దీనిలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా ఇటీవల కేంద్రం చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీ వాదనను సమర్థించింది.
కృష్ణానదీ జలాలలో ఏపీ వాటాగా విడుదలవుతున్న నీటిని సక్రమంగా వినియోగించుకుని రాయలసీమ నెల్లూరు జిల్లాల ప్రజల సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Recommended Video
రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణా సర్కార్ సమరం
రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఏపీ నిర్ణయంతో అగ్గిమీదగుగ్గిలం అయిన తెలంగాణ సీఎం కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పై నిప్పులు చెరిగారు. కృష్ణానది బోర్డుకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టులోనూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. మరోపక్క తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు అటు హైకోర్టు లోనూ,జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ పిటిషన్లు వేసి ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.