రోహిత్ ఆత్మహత్య ఘటనపై హోంమంత్రి నాయిని ఆసక్తికర వ్యాఖ్య
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన తమ పరిధిలోనిది కాదని, కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంస్ ఎన్నికల నేపథ్యంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ ఘటనలో తలదూర్చి చేతులు కాల్చుకోవడం లేదన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు సిఫారసు చేశామన్నారు. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కేటీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గచ్చిబౌలి ఎల్అండ్టీ టవర్స్లో మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసుల సమస్యల పరిష్కారానికి ప్రతి డివిజన్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతోనే హైదరాబాద్ అభివృద్ధి: కవిత
టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో శనివారం ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లోని సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్కు సహకరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అగ్రస్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్కు ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. టీఆర్ఎస్కు ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.