కంటోన్మెంట్ సీఈఓ సుజాతగుప్తాకు హోంమంత్రి నాయిని వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను, బోర్డు సభ్యులను వేధించడం మానుకోవాలని కంటోన్మెంట్ సీఈఓ సుజాతగుప్తాకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే కంటోన్మెంట్ 3వ వార్డులో బోర్డు సభ్యురాలు అనిత ఆధ్వర్యంలో రూ.45 లక్షల కంటోన్మెంట్ బోర్డు నిధులతో చేపట్టిన మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ సీఈఓ సుజాతగుప్తా వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారని, ప్రజలను సమస్యలను పరిష్కరించాల్సి బాధ్యత బోర్డు సభ్యులపై ఉంటుందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలను, బోర్డు సభ్యులను సీఈఓ సుజాతగుప్తా వేధిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సాధారణంగా కంటోన్మెంట్ బ్రిగేడియర్, సీఈఓలు ఆర్మీకి సంబంధించిన వారే ఉంటారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులకు, కంటోన్మెంట్ సీఈఓ సుజాతగుప్తా సహకరించలేదనే వార్తలు వస్తున్నాయి.
దీంతో రంగంలోకి దిగిన హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, కంటోన్మెంట్ సీఈఓ సుజాతగుప్తాకు బోర్డు సభ్యులను వేధించడం మానుకోవడంతో పాటు జాగ్రత్తగా మసులుకోవాలని, లేకపోతే ఢిల్లీకి వెళ్లిపోవాలని సూచించారు. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో కంటోన్మెంట్ అభివృద్ధిపై కూడా దృష్టి సారించామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి, 1వ వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, 3వ వార్డు సభ్యురాలు బి.అనిత, మాజీ సభ్యుడు బీ.ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.