నాయినికి చిక్కులు: అల్లుడి సెటిల్మెంట్లో ఆత్మహత్యాయత్నం, కేసు నమోదు చేయని పోలీసులు
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో జరిగిన సెటిల్మెంట్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక మహిళకు అప్పు ఇచ్చిన వ్యక్తులపై శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారు. దీంతో బాధితుల్లో ఒకతను బ్లేడుతో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బాధితులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మయూరి టక్కర్ అనే మహిళ తల్వార్ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా నవీన్, సుధీర్ అనే ఇద్దరికి పరిచయమైంది. తానొక పారిశ్రామికవేత్తనని వారిని నమ్మించి, వారి వద్ద నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది.
తాను తీసుకున్న రూ. 5 లక్షలకు వడ్డీ కడుతూ వచ్చింది. ఆ తర్వాత చాలా చాకచక్యంగా మరో రూ. 50 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరింది. అంత డబ్బు తమవద్ద లేదంటూ... నవీన్, సుధీర్ కలిసి మయూరికి తొమ్మిది నెలల క్రితం రూ.38 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోపు తిరిగి చెల్లిస్తానని ఆమె లిఖిత పూర్వక హామీ ఇచ్చింది.
దీంతో గడువు దాటినా ఆమె డబ్బులు చెల్లించలేదు. మరోవైపు నవీన్, సుధీర్లు తమ వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించాలని ఆమెను ఒత్తిడి చేశారు. దీంతో ఆమె వారిద్దరిపై ఎదురుదాడికి దిగింది.
తనకు సీఎం తెలుసు, హోంమంత్రి తెలుసంటూ వారిని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందామని శుక్రవారం సాయంత్రం హోంమంత్రి అల్లుడు శ్రీనివాస రెడ్డి ఆఫీసుకు రావాలని వారికి చెప్పింది. దీంతో నారాయణగూడ లింగంపల్లిలోని ప్రగతి ప్రైడ్ అపార్ట్మెంట్లో ఉన్న శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి నవీన్, సుధీర్ వచ్చారు.
అపార్ట్మెంట్లోకి వచ్చీ రాగానే శ్రీనివాస్ రెడ్డి అనుచరులు తల్వార్లతో వీరిపై దాడి చేశారు. దీంతో భయపడిపోయిన సుధీర్ పరుగెత్తుకుంటూ అపార్ట్మెంట్ కిందకు వచ్చి గేటు వద్ద బ్లేడుతో గొంతుకోసుకొని కింద పడిపోయాడు. దీనిని గమనించిన ఆపార్ట్మెంట్ వాచ్మెన్ నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని సుధీర్ను ఆసుపత్రికి తరలించారు. నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన సంఘటన బయటికి పొక్కకుండా చూడాలని భావించినా, సుధీర్ ఆత్మహత్యాయత్నంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నవీన్పై దాడి, సుధీర్ ఆత్మహత్యాయత్నంపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని నారాయణగూడ పోలీసులు తెలిపారు. హోంమంత్రి అల్లుడికి సంబంధించిన వ్వవహారం కావడంతో పోలీసులు ఆచితూచి వ్వవహరిస్తున్నట్లు తెలిసింది. ఇక గతంలో ఇదే అపార్ట్మెంట్లో హోం మంత్రి నివసించారు.
ఇప్పుడు ఈ ప్లాట్ను అల్లుడు శ్రీనివాస రెడ్డి తన కార్యాలయంగా మార్చుకున్నారు. చిన్నపాటి పంచాయతీల నుంచి బడా సెటిల్మెంట్ల వరకు ఈ ఫ్లాట్ అడ్డాగా మార్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.