స్వాతి-నరేశ్ విషాద ప్రేమలో విలన్లు పోలీసులేనా!?: ఈ ప్రశ్నలకు జవాబేదీ?
పరువు హత్యల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. కుల బలం ఉంటే చాలు ఏమైనా చేసేయొచ్చు అనే ధోరణిని నిందితుల్లో బలపడేలా చేస్తోంది.
హైదరాబాద్: పరువు హత్యల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు.. కుల బలం ఉంటే చాలు ఏమైనా చేసేయొచ్చు అనే ధోరణిని నిందితుల్లో బలపడేలా చేస్తోంది. కింది కులాలకు చెందిన వ్యక్తులను బలిపశువుల్ని చేసి.. కేసును తప్పుదోవ పట్టించడానికి ఎంతకైనా పోలీసులు వెనుకాడటం లేదు.
'అలా బతికేవారు': అదే పట్టించింది, నరేష్-స్వాతి మధ్య విభేదాలనే....
ఇటీవలి మంథని మధుకర్, జమ్మికుంట రాజేశ్, భువనగిరి నరేశ్ హత్య కేసుల్లో ఇదే విషయం స్పష్టమైంది. వీటన్నింటిల్లోను బాధితులు కింది స్థాయి కులస్తులు కాగా.. నిందితులంతా వారి కన్నా పై కులాలకు చెందినవారు. దీంతో పోలీసుల సహకారం సైతం బాధితులకు కరువవుతోంది. పై పెచ్చు వీరిపైనే జులుం ప్రదర్శించి.. హత్యలను సైతం ఆత్మహత్యలుగా చిత్రీకరించే దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్వాతి-నరేశ్ ప్రేమకథలో విలన్లుగా పోలీసులు:
స్వాతి-నరేశ్ ప్రేమ వ్యవహారంలో పోలీసులు కేసును సరిగ్గా డీల్ చేసి ఉంటే.. ఈ ఇద్దరు తమ ప్రాణాలు కోల్పోయేవారు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. చట్టప్రకారం పెళ్లి చేసుకున్న వీరిద్దరికి రక్షణగా నిలబడాల్సింది పోయి.. నిందితులకు సహకరించే రీతిలో పోలీసులు వ్యవహరించడం పరువు హత్యల్లో వారి వైఖరిని పట్టిస్తోంది. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అటు సామాజికంగాను ఇటు ఆర్థికంగాను బలంగా ఉన్న వ్యక్తి కావడంతో.. పోలీసులు అతని కనుసన్నుల్లోనే కేసును నడిపించినట్లు ఆరోపణలున్నాయి.
వాట్సాప్ లో వైరల్:
ముంబైలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్న స్వాతి-నరేశ్ లను ఎలాగైనా తిరిగి రప్పించడానికి శ్రీనివాసరెడ్డి ఒక పథకం పన్నాడు. మాయ మాటలతో వారిని భువనగిరికి రప్పించే ప్రయత్నం చేశాడు. ఇందుకు పోలీసులు కూడా సహకరించినట్లు వాట్సాప్ లో వైరల్ అవుతోన్న ఒక ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది.
ఆత్మకూరు ఎస్ఐ శివనాగప్రసాద్.. స్వాతి-నరేశ్ లకు ఫోన్ చేసి స్వస్థలానికి రావాల్సిందిగా బెదిరింపులకు దిగాడు. వారిని భయపెట్టే రీతిలో అతని సంభాషణ సాగింది. 'మీరిద్దరు రాకపోతే.. ఇక్కడ మీవాళ్ల పని అవుతుంది' అంటూ స్వాతిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. భువనగిరి డీఎస్పీ ఆఫీస్ వద్దకు వచ్చి.. ' మేం బతికే ఉన్నాం అని చెప్పి వెళ్లండి. అటు నుంచి అటే వెళ్లొచ్చు.. లేదంటే వీళ్లకు ఇబ్బందవుతుంది' అని స్వాతితో చెప్పాడు.
స్వాతి భువనగిరికి.. నరేశ్ హయత్ నగర్కు:
ఎస్ఐ ఫోన్ మేరకు.. మే 2వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు భవనగిరి సమీపంలోని సత్యం దవాఖాన వద్ద బస్సు దిగింది. నరేశ్ మాత్రం తాను హయత్ నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పెళ్లాడు. సత్యం దవాఖానా నుంచి బంధువు సత్తిరెడ్డి కారులో స్వాతి లింగరాజ్ పల్లికి బయలుదేరింది. ఇంటికెళ్లాక.. అంతా కలిసి భోజనం చేశారు.
రాత్రి 11గం.కు ఏం జరిగిందంటే!:
భోజనం చేసిన తర్వాత.. శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో.. ఎవరో వ్యక్తి ఇంటి ముందు బైక్ పై తచ్చాడుతున్నట్లు గుర్తించారు. అతన్ని నరేశే అక్కడికి పంపించాడన్న అనుమానం కూడా వారికి కలిగింది. దీంతో అతన్ని బైక్ పై వెంబడించగా.. మధ్యలో నరేశ్ కలిశాడు.
ఇక్కడేం చేస్తున్నావు.. ఇంటికి రావచ్చు కదా.. అంటూ మాయ మాటలతో అతన్ని బైక్ పై ఎక్కించుకున్నారు. ఆపై తమ పొలం వద్దకు తీసుకెళ్లారు. శ్రీనివాసరెడ్డి తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్ తో నరేశ్ తలపై బలంగా కొట్టడంతో.. అక్కడిక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు కథనం ఇలా!:
ఎస్ఐ ఫోన్ మేరకు స్వాతి-నరేశ్ లు ఇద్దరూ తమ గ్రామానికి వచ్చారు. ఆపై పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా.. రామన్నపేట సీఐ ఎన్.శ్రీనివాసరెడ్డి స్వాతిని ఆమె తండ్రితో పంపించాడు. ఇక్కడే పోలీసుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. చట్టప్రకారం పెళ్లి చేసుకున్న ఇద్దరు మేజర్లను విడదీసేందుకు పోలీసులకు ఎటువంటి అధికారం లేదు.
అలాంటిది స్వాతిని ఆమె తండ్రితో పంపించి, నరేశ్ ను ఇంటికి పంపించడం పట్ల పోలీసులు తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు సహకరించేలా వారు వ్యవహరించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం తాము శ్రీనివాసరెడ్డి పెట్టిన మిస్సింగ్ కేసుకు అనుగుణంగానే వ్యవహరించామని చెబుతున్నారు.
ఇవీ అనుమానాలు:
నరేశ్ సెల్ ఫోన్ చివరిసారిగా మౌలాలిలో స్విచాఫ్ అయినట్లు అప్పుడే గుర్తించామని భువనగిరి పోలీసులు చెబుతున్నారు. అంటే నరేశ్ లింగరాజుపల్లికి వెళ్లినట్లు తప్పకుండా గుర్తించే ఉంటారు. దీని ఆధారంగానైనా శ్రీనివాసరెడ్డిని గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడే చిక్కుముడి వీడేది. నరేశ్ భువనగరిలో ఎవరితో మాట్లాడనే విషయాన్ని కూడా పోలీసులు పట్టించుకున్నట్లు లేదు. ఇక నరేశ్ వెంట మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తున్నా.. ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరో మాత్రం పోలీసులు కనిపెట్టలేదు.
స్వాతి ఇంటి ఎదుట తచ్చాడింది అతనే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక నరేశ్ హత్యానంతరం అతని సెల్ఫోన్ను సత్తిరెడ్డి హైదరాబాద్లోని బోడుప్పల్ బాలాజీ హిల్స్కు తీసుకువచ్చి పూర్తిగా ధ్వంసం చేశాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించడం గమనార్హం.
ఏదేమైనా ఈ కేసులో పోలీసులు పక్షపాత వైఖరి, వారి డొల్లతనం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేసుకు సంబంధించిన అనేక చిక్కుముడులను వారు పట్టించుకోకపోవడం వారి సీరియస్ నెస్ ను పట్టిస్తోంది.