ఐటీ కారిడార్లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ, సుహాసినికి సీమాంధ్రులు షాకిచ్చారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేపథ్యంలోని మహాకూటమికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పొత్తుగా వెళ్లినప్పటికీ కనీసం ఇరవై సీట్లు గెలుచుకోవడం కష్టంగా మారింది. టీడీపీ కారణంగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్లతో పాటు హైదరాబాద్లో లబ్ధి చేకూరుతుందని భావించగా, ఆ ఆశలు నెరవేరలేదు.
పైగా, తెలంగాణలోని సీమాంధ్రులు కూడా, ముఖ్యంగా హైదరాబాదులోని సీమాంధ్రులు తెరాసకు ఓటు వేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలో గెలుపును కాంగ్రెస్ పార్టీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే చంద్రబాబు, బాలకృష్ణ, ఏపీ మంత్రులు పరిటాల సునీత, సుహాసిని తరఫున నటులు తారకరత్న, కళ్యాణ్ రామ్ సతీమణి, జానకిరామ్ సతీమణిలు ప్రచారం నిర్వహించారు. కానీ ఫలితం దక్కలేదు.
హైదరాబాద్లో ఈసారి తెరాస హవా
2014 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిసరాల్లో టీడీపీ 12 స్థానాల్లో గెలిచింది. కానీ ఈసారి ఒక్క సీటు గెలవలేదు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 15 నియోజకవర్గాలు ఉండగా మజ్లిస్, బీజేపీ పోను టీడీపీనే సత్తా చాటింది. నాడు తెరాస ఒకే స్థానంలో గెలిచింది. కానీ ఇప్పుడు మజ్లిస్ తన ఏడు స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానంలో బీజేపీ గెలుచుకుంది. ఈసారి మిగిలిన 7 స్థానాల్లో తెరాస విజయబావుటా ఎగురువేసింది.
సుహాసినికి భారీ ఓటమి
చంద్రబాబు సనత్ నగర్, కూకట్పల్లి నియోజకవర్గాలను చాలా కీలకంగా భావించారు. అక్కడ కూడా టీడీపీకి గట్టి షాకి తగిలింది. సనత్ నగర్ నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టుబట్టి తీసుకున్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి కూడా ఓడిపోయారు. అలాగే కూకట్పల్లి నుంచి నందమూరి కుటుంబ సభ్యురాలు సుహాసినిని బరిలోకి దింపారు. ఆమెను బరిలోకి దింపడం ద్వారా కూకట్పల్లిలో గెలవడంతో పాటు హైదరాబాద్, తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభావం చూపుతుందని భావించారు. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. అత్యంక కీలకంగా భావించిన, అందరి దష్టిని ఆకర్షించిన కూకట్పల్లిలో నందమూరి సుహాసిని 41వేల పైచిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఓటమి చవిచూశారు. సనత్ నగర్లో సీమాంధ్రుల ఓటర్లు ఉండటంతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఓడించాలని చంద్రబాబు భావించారు. కానీ నెవరేరలేదు.
ఐటీ కారిడార్లో టీడీపీకి దెబ్బ
టీడీపీ కీలకంగా భావించిన సీట్లలో శేరిలింగంపల్లి కూడా ఉంది. ఇక్కడ కూడా సీమాంధ్రుల ఓటర్లు ఎక్కువగానే ఉన్నాయి. కూకట్పల్లితో పాటు శేరిలింగంపల్లి ఐటీ కారిడార్లో ఉంది. కాబట్టి ఈ సీట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా నెరవేరలేదు. ఇక్కడ జోరుగా ప్రచారం చేసిన చంద్రబాబు హైదరాబాదులో ఐటీ అభివృద్ధికి తానే కారణమని చెప్పారు. ఇక్కడ అరికెపూడి గాంధీ దాదాపు 34వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.
ఖమ్మంలోనే రెండు స్థానాలు టీడీపీ ఖాతాలో
తెలుగుదేశం 13 స్థానాల్లో పోటీ చేసింది. కానీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. అప్పుడు హైదరాబాద్ పరిధిలో తెరాస ఒక్క సీటైనా గెలిచింది. కానీ ఈసారి టీడీపీ ఒక్కటీ గెలవలేదు. జిల్లాల విషయానికి వస్తే... మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచీ గెలవలేదు. టీడీపీ మొత్తంగా రెండు సీట్లు గెలవగా.. ఆ రెండు కేవలం ఖమ్మం జిల్లాలోనే గెలిచింది.
ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అంటే?
జిల్లాల వారీగా చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉండగా తెరాస 13, కాంగ్రెస్ ఒకటి, కరీంనగర్ జిల్లాలో 13 సీట్లు ఉండగా తెరాస 11, కాంగ్రెస్ 1, స్వతంత్రులు ఒకటి, అదిలాబాద్ జిల్లాలో పది స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ ఒకటి, మెదక్ జిల్లాలో పది స్థానాలకు గాను తెరాస 9, కాంగ్రెస్ ఒకటి, వరంగల్ జిల్లాలో 12 సీట్లు ఉండగా తెరాస 10, కాంగ్రెస్ 2, ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు ఉండగా మహాకూటమికి 8 స్థానాలు రాగా, తెరాసకు 1, స్వతంత్రులకు 1, హైదరాబాదులో 15 స్థానాలు ఉండగా తెరాస 7 స్థానాలు, మజ్లిస్ 7, బీజేపీ 1 స్థానంలో గెలిచింది. రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాలు ఉండగా తెరాస 11, కాంగ్రెస్ 3, నిజామాబాద్లో 9 స్థానాలు ఉండగా తెరాస 8, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది. నల్గొండ జిల్లాలో 12 స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ మూడింట గెలిచింది.