ఆశలు నెరవేర్చలేకపోయా..: హాస్టల్లోనే ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర రాజీవ్గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ(ఆర్జీయూకేటీ)లో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది.
బాసర: నిర్మల్ జిల్లా బాసర రాజీవ్గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ(ఆర్జీయూకేటీ)లో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ చదువుతున్న కురాకుల రాధ (20) శుక్రవారం వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విద్యాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాధ.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం మార్లగడ్డ క్యాంప్నకు చెందిన శ్రీనివాస్ కూతురు. కాగా, ఆమె 10రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం రాకపోవడంతో తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేనని తరచూ బాధపడేది.
శుక్రవారం మధ్యాహ్నం ధ్యానం చేసుకుంటానని స్నేహితులను గది నుంచి బయటకు పంపించి ఫ్యాన్కు ఉరివేసుకుంది. గమనించిన స్నేహితులు, సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి కాపాడేందుకు యత్నించారు. కొనవూపిరితో ఉన్న ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
మర్లగడ్డకు చెందిన రైతు శ్రీనివాస్ కూతురైన రాధది నిరుపేద కుటుంబం. పదోతరగతిలో 551 మార్కులు సాధించి ఆర్జీయూకేటీకి ఎంపికైంది.మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థినికి గత 10రోజుల్లో 2సార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయిందని విద్యాలయ వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈ ఏడాది కళాశాలకు వివిధ రకాల కం పెనీలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాయన్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు తమ ప్రతిభను చాటి ఉద్యోగాలు సాధించారన్నారు. ఈసీఈ, పీఎస్ఈ, ఈఈఈలతో పోల్చితే ఎంఎంఈ విభాగంలో తక్కువ ఉద్యోగాలు వస్తాయన్నారు. సదరు విద్యార్థిని ఉద్యోగం రాకపోవడంతో కొన్ని రోజుల నుంచి మనస్తాపానికి గురయ్యిందని చెప్పారు. దీంతో చీఫ్ వార్డెన్ నం దిని, సైకాలజిస్ట్ నాగలక్ష్మి, ప్లేస్మెంట్ అధికారిణి నాగలక్ష్మితో నిత్యం కౌన్సెలింగ్ ఇప్పించేవారమని తెలిపారు.
ఈ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ రెండు రోజులు ఉందని, ఇంటి వద్ద కుటుంబ పరిస్థితి బాగా లేదని, తండ్రి శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడ పిల్లలను చదివిస్తున్నాడని చెప్పా రు. ఉద్యోగం సాధించాలని తండ్రి అంటుండేవాడని రాధ తెలిపిందని ప్రిన్సిపాల్ తెలిపారు.