దిగజార్చారు: నోటుకు ఓటుపై ఉత్తమ్, '17 మంది ఎమ్మెల్యేల సంగతేమిటి?'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రలోభాల వ్యవహారంలో కొందరు పట్టుబడితే.. మరి కొందరు పట్టుబడకుండా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.
ఓటుకు నోటు వ్యవహారంతో ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. ఏపీ కేడర్ అధికారి సోమేష్కుమార్ టిఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పాలనను గాలికొదిలేశారని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చాడ వెంకటరెడ్డి అన్నారు.
టిఆరెఅస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన కాంగ్రెసు, టిడిపి, వైసిపిలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల కాల్లిస్టును బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు డ్రామాలు ఆడుతున్నారని పొన్నం విమర్శించారు.