ఆగ్నేయం భగభగ: తెలంగాణలో వేడిగాలుల తీవ్రత: బయట తిరక్కపోవడమే బెస్ట్: ఐఎండీ
హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. ఏ వేసవి సీజన్లో అయినా పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వేడి గాలులు వీస్తోన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే 36 గంటల పాటు తెలంగాణలో ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సోమవారం వరకూ వేడి గాలుల ఉధృతి కొనసాగే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటికి రావాలని సూచించారు.
ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడానికి అవకాశం ఉంటుందంటూ ఇదివరకే అధికారుల హెచ్చరికలను జారీ చేశారు. దీనికి అనుగుణంగా వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండ తీవ్రత భయపెడుతోంది. ఈ నెలలో సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుందంటూ ఇదివరకే అంచనా వేశారు. ఎండ సెగకు వేడి గాలులు తోడు కావడం వల్ల తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం.. మరో 36 నుంచి 48 గంటల పాటు వేడి గాలులు వీస్తాయని స్పష్టం చేస్తున్నారు.
ఆగ్నేయ దిక్కు నుంచి వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటోందని తెలిపారు. ఈ వేసవిలో సాధారణం కంటే మూడు డిగ్రీల మేర ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, వేసవి సీజన్ మధ్యలో దీని సగటు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. ఆగ్నేయ దిశ నుంచి వీస్తోన్న వేడి గాలుల తీవ్రత వల్ల వచ్చే వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. గత 24 గంటల్లో భద్రాచలం-38.5, ఆదిలాబాద్-37.2, ఖమ్మం-35 డిగ్రీల సెల్సియస్ మేర పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం దీని తీవ్రత మరింత అధికమౌతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.