ఆత్మహత్యల్లో టాప్ 10లో తెలంగాణా: ప్రభుత్వ గణాంకాలతో ప్రజల్లో హైరానా
తెలంగాణా రాష్ట్రంలో ప్రగతి మాట ఎలా ఉన్నా చిన్న రాష్ట్రం అయినా చింతలు లేని రాష్ట్రం , ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్న రాష్ట్రం అనుకుంటే తప్పులో కాలేసినట్టే . ఎందుకంటె తెలంగాణా రాష్ట్రంలో ఆత్మహత్యల మీద తాజా లెక్కలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారో తెలీదు కానీ తెలంగాణా రాష్ట్రంలో సూసైడ్ రేట్ చాలా ఎక్కువగా పెరిగింది అనేది తెలుస్తుంది. దేశంలో చిన్న రాష్ట్రం అయిన తెలంగాణా ఆత్మహత్యల్లో ఏ స్థానంలో ఉందో తెలిస్తే షాక్ అవటం గ్యారెంటీ .
ఆత్మహత్యల్లో ఏడో స్థానంలో తెలంగాణా రాష్ట్రం
దేశంలో ఎక్కువగా ఆత్మహత్యలు నమోదయ్యే రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ ఎక్కువగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు . ఇక ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది తమిళనాడు. ఇక ఈ జాబితాలో తెలంగాణా రాష్ట్రం ఏడో స్థానంలో ఉండటం నిజంగా ఆందోళన కలిగిస్తున్న అంశం . దేశంలోనే చిన్న రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ.. ఆత్మహత్యల్లో మాత్రం తెలంగాణ ఏడో స్థానంలో ఉండటం అటు తెలంగాణా సర్కార్ ను, ప్రజలను ఆలోచించేలా చేస్తుంది.
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రజలు
ఇటీవల మనకు తెలిసిన ఆత్మహత్యలను చూస్తే పెద్దగా కారణాలు లేకుండానే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల కాకతీయ కెనాల్ లో పడి చనిపోయిన పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ఇటీవల ఒక తండ్రి తనకు ట్యాబ్ ఇవ్వలేదని తనకు కాకుండా సోదరుడికి ఇచ్చాడని ఒక చిన్నపిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణలో పెరుగుతున్న సూసైడ్స్
ఆస్తులు బాగా ఉన్నా అప్పులు ఉన్నాయని అప్పుల బాధ తాళలేక ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యా పిల్లలను చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే . నరేందర్ గౌడ్ అనే వ్యక్తి కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే . ఇలా రోజూ సగటున 21 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
Recommended Video
సూసైడ్ గణాంకాలతో ఆందోళనలో ప్రభుత్వం, ప్రజలు
2018లో నమోదు అయిన ఆత్మహత్యల లెక్కల ప్రకారం మాత్రమే ఈ సగటు.. ఇప్పుడు ఇంకా పెరిగినట్టు భావిస్తున్నారు. మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపధ్యంలోనే చాలా మంది ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం . ఇక ఈ రిపోర్ట్ అటు ప్రభుత్వాన్ని, అలాగే ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. అక్షరాస్యత తక్కువగా ఉండి అనేక సమస్యలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఆత్మహత్యల విషయంలో చివరి స్థానాల్లో ఉంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లోనే ఆత్మహత్యల సంఖ్య అనూహ్యంగా పెరగటం గమనార్హం. అతి చిన్న, కొత్త రాష్ట్రం, అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రంలో ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం నిజంగా బాధాకరం .