అవహేళనలూ అవమానాలే ఎదురయ్యాయి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలుగు భాష, సాహిత్యం, కళల సమగ్ర వికాసం కోసం తెలంగాణ సారస్వతాభిమానులుసమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. 1956లో జరిగిన హైదారాబాద్, ఆంధ్ర రాష్ర్టాల విలీనంతో తెలంగాణకు అవహేళనలు, అవమానాలే ఎదురయ్యాయని అన్నారు.
అన్ని రంగాలతోపాటు భాష, కళలపై ఆంధ్ర ఆధిపత్యంతో తెలంగాణ విసిగి వేసారిందని చెప్పారు. ఆరు దశాబ్దాలలో 13 జిల్లాల ఆధిపత్యంతో తెలంగాణ మౌఖిక సాహిత్యం, స్త్రీల పాటలు, బతుకమ్మ పాటలు, బాలల సాహిత్యం కనుమరుగైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే దిశగా తెలంగాణ సాహిత్యం, మాండలికాలు, అముద్రిత రచనలపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని కవిత అభిప్రాయపడ్డారు.
శుక్రవారం తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సురవరం ప్రతాప్రెడ్డి వ్యాసాలు, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు యాభై ఏళ్ల జ్ఞాపకాలు, తెలంగాణ ప్రాచీన కవుల కవితా ప్రాభవం, కుతుబ్షాహీల తెలుగుసాహిత్య సేవ, తెలంగాణ మాండలిక పదాలు -కావ్య ప్రయోగాలు, తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు, మా ఊరు మాట్లాడింది, తెలంగాణ ప్రముఖుల పరిణతవాణి ప్రసంగాలు, జానపద సాహిత్యం- స్త్రీలపాటలు- సంప్రదాయం, బంజారాల వివాహ ఆచార పద్ధతులు అనే 12 గ్రంథాల ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ గ్రంథాలను ఎంపీ కవిత ఆవిష్కరించారు. సభకు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు.
తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక విధి నిర్వహణాధికారి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సారస్వత పరిషత్ కోశాధికారి ఎం శ్రీనివాస రామారావు తదితరులు పాల్గొన్నారు. మొదట్లో నిజామాంధ్ర సారస్వత పరిషత్గా ప్రారంభమమైన ఈ సాహితీ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర అధిపత్యంతో ఆంధ్ర సారస్వత పరిషత్గా మారిందని కవిత అభిప్రాయపడ్డారు.
తెలుగు భాష వికాసానికి ప్రాంతీయ భేదాలు అడ్డుకాకూడదని అన్నారు. నిజాం పరిపాలనలో తెలుగును అణగదొక్కడానికి జరిగిన ప్రయత్నాలను ఛేదించి అప్పట్లో సురవరం ప్రతాపరెడ్డి, కేశవపంతుల లక్ష్మీనరసింహశాస్ర్తీ, కప్పగంతుల లక్ష్మణశాస్ర్తీ వంటి కవులు విప్లవంతో సాహిత్యం రాసారని, స్వతంత్రం వచ్చాక తెలుగు భాషకు ప్రాధాన్యత వచ్చిందని ఆమె అన్నారు.