"అది కూడా తెలుసుకోలేనంత వీక్గా తెలంగాణ ఇంటలిజెన్స్!"
హైదరాబాద్ : తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ.. అధికార టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అంటూ తనను సంబోధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం తనపై దాడికి పాల్పడుతోందని మండిపడ్డారు.
బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా.. టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు కోదండరాం. ఏఐసీసీ చీఫ్ తో భేటీ అయ్యారన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ.. తెలంగాణ ఇంటలిజెన్స్ అంత వీక్ గా ఉందా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ఏ తేదీల్లో అయితే తాను సోనియా గాంధీని కలిశాను అని చెబుతున్నారో.. ఆ తేదీల్లో తాను కాశీలో ఉన్నానని చెప్పారు.
జూన్ 27వ తేదీన ధర్నాలో పాల్గొన్నానని ప్రకటించిన కోదండరాం.. తానెప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నానో తెలుసుకోలేనంతా బలహీనంగా తెలంగాణ ఇంటలిజెన్స్ ఉందా? అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి టీఆర్ఎస్ అనవసర రాద్దాంతానికి దిగుతోందని మండిపడ్డారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన కోదండరాం.. జేఏసీ చేస్తోన్న ఆరోపణలన్ని సామాజిక వాస్తవాలేనని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశించింది ఇది కాదని కోదండరాం పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో తమ కార్యాచరణ గురించి చెబుతూ.. నవంబర్ 11న మంథనిలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 13న హైదరాబాద్ లో వైద్యరంగ సమస్యలపై, 20న సాగునీటి, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్టుల సమస్యలపై సదస్సులు నిర్వహించనున్నట్టు కోదండరాం చెప్పారు.