కరోనా ఎఫెక్ట్: ఇంటర్ సప్లిమెంటరీ రద్దు.. అందరూ పాస్: మంత్రి సబిత
దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పుడప్పుడే తగ్గేలా లేకపోవడంతో పరీక్షలన్నీరద్దయిపోతున్నాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కరోనాకు ముందే నిర్వహించినా... వాటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం చేపట్టాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు కూడా చివరికి రద్దయిపోయాయి. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటించారు.
పరీక్షల రద్దు నిర్ణయంతోపాటు, గతంలో ఫెయిలైన విద్యార్థులు అందరినీ పాస్ చేస్తున్నామని మంత్రి సబిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
''2020లో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నాం. వీళ్లంతా కంపార్ట్ మెంట్ లో ఉత్తీర్ణులైనట్టు మార్కుల జాబితాలో ఉంటుంది. జూలై 31 తర్వాత సంబంధిత కాలేజీల నుంచి మార్కుల మెమోలను పొందొచ్చు. అలాగే, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెమోలను 10 రోజుల తర్వాత అందిస్తాం''అని విద్యా శాఖ మంత్రి సబిత వివరించారు.