17 నుంచి కాలేజీలకు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల ఉపసంహరణ
హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 17 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.
ఆగస్టు నెలాఖరు వరకు కూడా విద్యాసంస్థలు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆన్లైన్ తరగతులు జరిగినా సరే ఆగస్టు నెలాఖరు వరకు విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోవని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.
అంతకుముందు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న స్టాఫ్ అందరూ కాలేజీకి రావాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది కళాశాలలకు హజారు కావాలని ముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అడ్మిషన్స్ మీద కూడా లెక్చరర్లు దృష్టి పెట్టాలని సూచించారు.
ఇది ఇలా వుండగా, కరోనా కేసులు తెలంగాణలో రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 88,396 కరోనా కేసులు నమోదయ్యాయి. 23,438 యాక్టివ్ కేసులున్నాయి. 64,284 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 674 మంది మరణించారు.