ఆ ఎమ్మెల్సీ బాబు తొత్తు, తొలి ఎన్నికలు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే దమ్ము లేకనే బీజేపీని అడ్డుపెట్టుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును దేవీ ప్రసాద్కు వేసి గెలిపించాలని అన్నారు. బీజేపీకి అభ్యర్ధికి ఓటేస్తే ఆ ఓటు చంద్రబాబు ఖాతాలో జమ అవుతుందని విమర్శించారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రబాబు తొత్తుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజానీకాన్ని కరెంట్ కష్టాలకు గురి చేసినందుకు వారికి ఓటేద్దామా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో దేవీ ప్రసాద్ను గెలిపించకుంటే తమను తాము గెలిపించుకున్నట్లేనని అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు పట్టని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మంలోని ఏడు మండలాలను ఆర్డినెన్సు ద్వారా ఏపీలో కలుపుకొని పొలవరం ముంపులో మంచుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ వ్యతిరేకులకు చెంపపెట్టు కావాలని అన్నారు.
ఇక మరో మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఉద్యమకారులు గెలవాలో, తెలంగాణ ద్రోహులు గెలవాలో మేధావులైన పట్టభద్రులు ఆలోచించాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం రాత్రికి రాత్రి ఏడు మండలాలను ఏపీలో కలిపిన చంద్రబాబు, బీజేపీకి తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్కు నాయకులు లేరు. తెలుగుదేశం పార్టీకి కేడర్ లేదు. బీజేపీకి ఓట్లు లేవు కాబట్టి బంగారు తెలంగాణ కోసం పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించాలని కోరారు.