దత్తాత్రేయకు రోహిత్ ఆత్మహత్య చిక్కులు: కవిత పోస్టర్తో ఇంటి ముట్టడి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య సంఘటన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు చిక్కులు తెచ్చిపెట్టింది. దత్తాత్రేయ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖ కారణంగానే ఐదుగురు హెచ్సియు విద్యార్థులను సాంఘికంగా బహిష్కరించారని, దానివల్లనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
రోహిత్ ఆత్మహత్యకు నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కార్యకర్తలు మంగళవారం ఉదయం దత్తాత్రేయ ఇంటిని ముట్టడించారు. కల్వకుంట్ల చిత్రం ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ, దత్తాత్రేయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ బాధ్యత వహించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దత్తాత్రేయ మంత్రి పదవికి రాజీనమా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఒక సందర్భంలో బారికేడ్లను తోసుకుని దత్తాత్రేయ నివాసంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆందోళనతో దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా హెచ్సియులో కూడా విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యుడైన దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు విసి అప్పారావును కూడా పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.