మహారాష్ట్రలో తెలంగాణ జాగృతి: మా బిడ్డల కోసమేనన్న ఎంపీ కవిత
హైదరాబాద్: మహారాష్ట్రలోను తెలంగాణ జాగృతి విభాగం ఏర్పాటు అయింది. మహారాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ రాజగిరి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, వెంకట్ తుత్తూరు, ఎస్ వేణుగోపాల్, కోశాధిగారిగా సురేందర్ నియమితులయ్యారు.
యువజన విభాగం అధ్యక్షుడిగా కూరపాటి నరేష్, సాహిత్య విభాగం అధ్యక్షుడిగా సంగినేని రవీంద్ర నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో జరిగిన సమావేశంలో కమిటీని ప్రకటించారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ, రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ జాగృతి సంస్థ విస్తృతంగా సేవలందిస్తోందని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అన్ని వర్గాల వారిని కలుపుకొని వివిధ రంగాల్లో స్ఫూర్తిని నింపేందుకు క్షేత్రస్థాయిలో కార్యవర్గాలను నెలకొల్పామన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలను కూడా ఒక వేదిక పైకి తెచ్చేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని ఆమె చెప్పారు. వివిధ దేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలున్నట్లు తెలిపారు.