అందుకే సభలకు అనుమతి నిరాకరణ: కోదండరామ్, అలా చేస్తే సభకు అనుమతి: రాచకొండ కమిషనర్
హైదరాబాద్:రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు వస్తాయని ధీమాగా ఉన్న టిఆర్ఎస్ సర్కార్ మా సభకు ఎందుకు అనుమతివ్వడం లేదని తెలంగాణ జనసమితి నేత , తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ ప్రశ్నించారు. సరూర్నగర్ లో ఏప్రిల్ 29న సభ నిర్వహణ అనుమతి కోసం కలెక్టర్కు ధరఖాస్తు చేసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలంగాణ జనసమితికి సూచించారు.
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశ్యంతోనే తమ సభలకు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని చెప్పేందుకు తమ సభలకు అనుమతిని నిరాకరించడమే కారణంగా ఆయన పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొంటామని ధీమాగా ఉన్న టిఆర్ఎస్ నేతలకు తాము సభలను నిర్వహించుకొంటే ఎందుకు ఇబ్బందులని ఆయన ప్రశ్నించారు. జవాబుదారీతనం లేకపోవడం వల్లే సర్కార్ ఈ రకంగా వ్యవహరిస్తోందన్నారు. చట్టబద్దంగా పాలన సాగాలని ఆయన కోరారు. దేశ భద్రతకు విఘాతం కలిగితేనే సభలు, సమావేశాల విషయంలో ఆంక్షలు, పరిమితులు విధించే అవకాశం ఉందన్నారు. కానీ, అలాంటి పరిస్థితులే లేనప్పుడు ఎందుకు తమ సభలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు తాము సభ నిర్వహణ కోసం అనుమతులు కోరితే అనుమతులను నిరాకరించడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.టిఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలను తాము వ్యతిరేకిస్తున్నందునే తమ సభలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అనుమతిచ్చినా లేకున్నా తాము ఏప్రిల్ 29న సభను నిర్వహించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు.
అలా చేస్తే సభకు అనుమతులు
ఏప్రిల్ 29న సరూర్నగర్ స్టేడియంలో తెలంగాణ జన సమితి సభకు అనుమతి కోసం కొన్ని పద్దతులను పాటించాల్సి ఉంటుందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణ కోసం కలెక్టర్ నుండి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందున్నారు. స్టేడియం పీజును చెల్లించాల్సి ఉందన్నారు. సభ కోసం పోలీసు శాఖ చేసిన సూచనలను పాటిస్తే అనుమతులు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన చెప్పారు.