కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన తెజస, సీపీఐ నిర్ణయం చారీత్రక తప్పిదమన్న కోదండరాం
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో మద్దతుపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఐ, సీపీఎంతో పాటు ఇతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేసినట్టు ఆయన తెలిపారు. అయితే ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు కొదండరాం చెప్పారు.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎఎస్ విధానాలు ఆయన ఎండగట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తన స్వంత ఆస్తిగా భావిస్తోందని ఆయన విమర్శించారు. అనేక మంది పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యాక్రమంలో కూడ ప్రజల భాగస్వామ్యానికి విలువ ఇవ్వడం లేదని చెప్పిన ఆయన ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నిరంకుశత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ఉప ఎన్నికలను వాడుకుంటామని ఆయన చెప్పారు. కొందరి స్వార్థం కోసం సహజవనరులను ప్రభుత్వం కొల్లకొడుతుందని ఆయన ఆరోపణలు చేశారు.
కాగా హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. గెలుపుకోసం మొత్తం మంత్రివర్గం పని చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. మరోవైపు అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు సర్పంచ్లను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇక సీపిఐ అధికార టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం చారీత్రక తప్పిదంగా కొదండరాం అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన తర్వాత ఆ పార్టీ నేత గూడురు నారయణ రెడ్డి కోదండరాంకు స్వీట్ తినిపించారు.