గాంధీ: రక్తంతో సంతకాలు చేసి నిరసన(ఫోటోలు)
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గాంధీలో జూనియర్ వైద్యులు చేపట్టిన గురువారం సమ్మె 17వ రోజుకు చేరుకుంది. చర్చలు సఫలం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలుపుతున్నారు.
తెలంగాణ జూనియర్ వైద్యులు గురువారం రాత్రి లోయర్ ట్యాంక్బండ్లో గోశాల నుంచి ఇందిరా పార్క్ దర్నా చౌక్ వరకు కొవ్వొత్తులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్లకు చెందిన వందలాది మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
గాంధీలో జూనియర్ వైద్యులు చేపట్టిన గురువారం సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఆస్పత్రి ఆవరణలో సంతకాల సేకరణ ప్రారంభించారు. ప్రభుత్వ వైఖరి వల్ల తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటు బైఠాయించి నిరసన తెలిపారు. సమ్మె తీవ్రం కావడంతో అత్యవసర విభాగంలో సేవలందించేందుకు ఆయుర్వేద వైద్య విద్యార్ధులను నియమించారు. అయితే ఎంత మంది వైద్యులు సేవలందిస్తున్నారన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
కోఠిలోని మెడికల్ కళాశాల ప్రాంగణంలో వందలాది మంది జూడాలు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు. తెలంగాణ జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ తాము సేకరించిన రక్త సంతకాలను ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేసి న్యాయం కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాఘవేంద్ర, మనోజ్, పృధ్వీ గుప్త తదితరులు పాల్గొన్నారు.
మెహిదీ పట్నంలోని సరోజినీ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో వచ్చిన రోగులు వైద్యం చేసేవారు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లకు పని ఒత్తిడి తీవ్రమైంది.
అంతక ముందు శనివారం (అక్టోబర్ 11)న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యతో జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు చర్చలు జరిపారు. శాశ్వత ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నియమిస్తేనే అక్కడ పనిచేస్తామని జూనియర్ డాక్టర్లు తెలుపుతున్నారు.
ఎవరి ప్రోద్భలంతో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారో తెలియడం లేదన్నారు. వారి కోర్కెల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా, సమ్మె కొనసాగించడం సరైందికాదన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తామనడం సరికాదన్నారు.