రణరంగంగా గాంధీ ఆసుపత్రి: రోడ్డెక్కిన జూనియర్ డాక్టర్లు: రాత్రి నుంచీ: కేసీఆర్ రావాలంటూ
హైదరాబాద్: తెలంగాణలో మూడు నెలలుగా కరోనా వైరస్ పేషెంట్లకు నిరంతరాయంగా వైద్య సేవలను అందిస్తోన్న జూనియర్ డాక్టర్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి వారు అహర్నిశలు శ్రమిస్తోన్న వారిపై కొందరు దాడులు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. గాంధీ ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళవారం రాత్రి ఆరంభమైన జూనియర్ డాక్టర్ల నిరసన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది.
సాదినేని యామినికి బంపర్ ఆఫర్: వారణాశి కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టులో ప్రతిష్ఠాత్మక పదవిలో
జూడాలపై దాడులతో..
బుధవారం మధ్యాహ్నానికి మరింత తీవ్రతరం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవంక డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లను ఫ్రంట్లైన్ వారియర్లుగా దేశం మొత్తం కీర్తిస్తోండగా.. మరోవంక వారిపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ కరోనా వైరస్ పేషెంట్ బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడులు చేశారు. కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న రోగి ఒకరు మృతి చెందారు.
రాత్రి నుంచీ కొనసాగింపు..
దీనికి ప్రధాన కారణం.. డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ పేషెంట్ బంధువులు ఆగ్రహంతో దాడికి దిగారు. వార్డులోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన ఓ జూనియర్ డాక్టర్పై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యుడు స్వల్పంగా గాయపడ్డాడు. గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు, పీజీ మెడికోలు, ఇతర వైద్య విద్యార్థులు ఏకం అయ్యారు. మంగళవారం రాత్రి మెరుపు సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు తమ నిరసన ప్రదర్శనలను బుధవారం కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వారు రోడ్డుపై బైఠాయించారు.
ఉద్రిక్తంగా మారిన గాంధీ..
కేసీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. సికింద్రాబాద్- ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రధాన మార్గంపై వందలాది మంది జూనియర్ డాక్టర్లు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాత్రివేళ గాంధీ ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయించి.. తమ నిరసనను వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు ఈ ఉదయం రోడ్డు మీదికి రావడానికి ప్రయత్నించారు. దాన్ని గమనించిన పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసివేయడానికి ప్రయత్నించారు.
పోలీసులతో ఘర్షణ..
ఇనుప బ్యారికేడ్లను ప్రధాన గేటుకు అడ్డుగా పెట్టారు. అయినప్పటికీ.. జూడాలు వెనక్కి తగ్గలేదు. గేటును, బ్యారికేడ్లను తోసుకుంటూ రోడ్డు మీదికి వచ్చారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో రోడ్డు మీదికి వచ్చిన జూడాలు అక్కడే బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంఘటనా స్థలానికి రావాలంటూ నినదించారు. పోలీసులు సర్దిచెబుతున్నప్పటికీ.. వినిపించుకోలేదు. తమ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టారు.
Recommended Video
పేషెంట్ల సంఖ్యను తగ్గించాలంటూ
గాంధీ ఆసుపత్రి ఇప్పటికే కరోనా వైరస్ పేషెంట్లతో నిండిపోయిందని, వారిని వేరే ఆసుపత్రులకు తరలించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాల్లో కూడా కోవిడ్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. గాంధీ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారు. ఫలితంగా తమపై ఒత్తిడి గంటగంటకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్లకు సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లను అందించట్లేదని మండిపడుతున్నారు. పెరుగుతున్న కరోనా పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బందిని కూడా పెంచాలని పట్టుబడుతున్నారు.