ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా తెలంగాణ: నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీపై కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తీసుకొచ్చిన నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ఎలక్ట్రిక్ వాహనాల శిఖరాగ్ర సదస్సులో మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ శుక్రవారం విడుదల చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతోందని, ఈ వాహనాలకు హబ్గా తెలంగాణను మార్చబోతున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సులో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నూతన ఎలక్ట్రిక్ విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందని, పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెడతాయన్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Govt of Telangana launches futuristic Telangana Electric Vehicle and Energy Storage Policy 2020-2030 at Telangana EV Summit in Hyderabad today.#TelanganaEVPolicy pic.twitter.com/VtUwHymml6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 30, 2020
తెలంగాణలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉందని, సరిగా వినియోగించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. తాజా ఎలక్ట్రిక్ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను రానున్న కాలంలో మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరై మాట్లాడారు.