తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్పై ఉత్కంఠ
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దాదాపు 3,500 పంచాయతీ స్థానాలకు 32 వేల వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
తుది దశ పోలింగ్
సమస్యాత్మక ప్రాంతాలతో పాటు వివాదస్పదంగా భావించిన పంచాయతీల్లో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సాయంత్రానికల్లా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే ఉప సర్పంచ్ ఎన్నికను ప్రారంభిస్తారు. ఒకవేళ సాయంత్రం కుదరని పక్షంలో గురువారం నాడు ఉప సర్పంచ్ ను ఎన్నుకునేందుకు అవకాశమిస్తారు.
ఓడిపోయాం, మా పైసలు మాకివ్వండి : తెలంగాణలో కొత్త ' పంచాయితీ '
ఓటింగ్.. ఉత్కంఠ
తుది దశ పంచాయతీ పోరులో 3,529 పంచాయతీలకు గాను 11,667 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. ఇక 27,583 వార్డులకు గాను 67,316 మంది బరిలో నిలిచారు. వాస్తవానికి 4వేలకు పైగా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,529 పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది.
కొన్ని చోట్ల బ్రేక్
పంచాయతీ ఎన్నికలకు జరిగిన తొలి రెండు దశల్లో 7, 043 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో కొన్ని ఏకగ్రీవం కాగా ఇతర స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. బుధవారం నాటితో తుది దశతో పంచాయతీ పర్వం ముగియనుంది. అదలావుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట మండలంలో 25 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. అవన్నీ ఎస్టీ రిజర్వ్ స్థానాలే. అయితే ఎలక్షన్లు రొటేషన్ పద్దతిలో నిర్వాహించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ఆ పంచాయతీ స్థానాల్లో ఎన్నికలకు బ్రేక్ వేసింది.