ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై భగ్గుమన్న లాయర్లు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని హుస్సేన్సాగర్ ప్రక్షాళన అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాసిన వార్తాకథనానికి తెలంగాణ న్యాయవాదులు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై భగ్గుమన్నారు. తీర్పునకు వక్రభాష్యం పలుకుతూ తప్పుడు కథనాలను ప్రచురించారని తెలంగాణ న్యాయవా ద జేఏసీ నేతలు విమర్శించారు.
వార్తాకథనాలకు నిరసనగా గురువారం జూబ్లీహిల్స్లోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. న్యాయవాద జేఎసీ కో-కన్వీనర్ కే గోవర్దన్రెడ్డి, అధికార ప్రతినిధి సీహెచ్ ఉపేంద్రలు మాట్లాడారు.
నీళ్లు, నిధులు, ఉద్యోగాలు నష్టపోయిన తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆర్ ఓ ఆశాదీపంలా మారారని వారన్నారు. నాడు కేసీఆర్ నడిపిన ఉద్యమంపై విషయం కక్కిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ, నేడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసత్య కథనాలను ప్రచురిస్తూ సభ్య సమాజానికి, పత్రిక రంగానికే మాయమచ్చగా మారాడని ఆరోపించారు.
హుస్సేన్ సాగర్ నీటి విడుదలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించి వార్తా కథనాలు ప్రచురించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలపై 200 సీఆర్పీ కింద కేసు వేసి న్యాయస్థానంలో నిలబెడుతామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు బిక్షమయ్య, కే సదానందం, ప్రవీణ్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.