తీరనిలోటు: ఎస్పీ బాలు మృతిపై హరీశ్, కేటీఆర్, విద్యాసాగర్ రావు సహా నేతల సంతాపం
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తోపాటు మంత్రి కేటీఆర్ ఎస్పీ బాలు మృతి విచారకరమని అన్నారు. ఆయన పాడిన పాటలు ఎప్పుడూ ప్రజల మనసులో నిలిచిఉంటాయని వ్యాఖ్యానించారు. బాలు మృతి సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటని అన్నారు.
ఎస్పీ బాలు మొదటి గురువు ఆయన తండ్రే: కోనేటమ్మపేట నుంచి మద్రాసుకు పయనమిలా..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్ణకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సినీలోకానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పారు. అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని హరీశ్ రావు కొనియాడారు. బాలులేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
ఎస్పీ బాలు మృతిపై మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
'యావత్ భారతావనికి తన గానామృతంతో మైమరపింపజేసిన బాలు మరణ వార్త విషాదకరం. ఇకపై మీ గొంతు మూగబోతుందన్న చేదు వార్త యావత్ భారతావన జీర్ణించుకోలేకపోతోంది. ఇకపై మీరు పాడిన పాటలు జ్ఞాపకాలలో మిమ్మల్ని చూసుకుంటాం. అశ్రు నయనాలతో ఆయనకు నివాళి తెలుపుతున్నాను' అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలు మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. బాలు కుటుంబసబ్యులకు, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.