తప్పులు రిపీట్ కావొద్దు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ కీలక సూచనలు
హైదరాబాద్: వచ్చే ఎన్నికలను సవాల్గా తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కర్నూలు పర్యటన ముగించుకున్న అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
అభ్యర్థుల ఎంపికపై చర్చ
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల తొలగింపు, అభ్యర్థుల ఎంపికపై దాదాపు గంటసేపు చర్చించారు.
రాహుల్ గాంధీ కీలక సూచనలు..
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్లు కలిసి మహాకూటమిగా ఏర్పడడంతో పొత్తులతో పార్టీ నష్టపోకుండా చూడాలని నేతలకు సూచించారు రాహుల్. ప్రచార కమిటీ, మేనిఫెస్టో, కూటమిలో సీట్ల సర్దుబాటు, ఎన్నికల వ్యూహాలపై కూడా కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. 2014లో చేసిన తప్పులు చేయవద్దని, ఐక్యంగా లేకపోవడం వల్లే అప్పుడు ఓటమి పాలయ్యామని చెప్పినట్లు తెలిసింది. ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లి పార్టీని గెలిపించాలని రాహుల్ సూచించారు.
కేసీఆర్ను ఓడించడమే లక్ష్యం
అనంతరం ఉత్తమ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలపై రాహుల్గాంధీతో చర్చించినట్లు చెప్పారు. కేసీఆర్ను ఓడించేందుకు అన్ని రాజకీయ, రాజకీయేతర శక్తులు కలిసిరావాలని కోరారు.
కర్నూలులో రాహుల్ గాంధీ: సంజీవయ్యకు నివాళి, విద్యార్థులతో ముఖాముఖి
కలిసికట్టుగా ముందుకు..
కుంతియా మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు, విద్యార్థులు నిరుత్సాహంగా ఉన్నారన్నారు. అందరూ కలిసి పనిచేయాలని రాహుల్గాంధీ సూచించారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాందీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం వరకు కర్నూలులో పర్యటించిన విషయం తెలిసిందే.