అంతా 10 ని.ల్లోనే.. ప్లకార్డులు చించిన అరుణ: సభలో గందరగోళం
భూసేకరణ చట్ట సవరణకు తెలంగాణ శాసనసభ ఆదివారం అమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టంలో కేంద్రం కొన్ని సవరణలు చేయాలని సూచించింది.
హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణకు తెలంగాణ శాసనసభ ఆదివారం అమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టంలో కేంద్రం కొన్ని సవరణలు చేయాలని సూచించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశ పెట్టారు. కేవలం పది నిమిషాల్లోనే ఆమోదం తెలిపారు.
మిర్చి రైతుల సమస్యలపై లేవనెత్తాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ పది నిమిషాల్లోనే అంతా ముగించి, చర్చకు సమయం ఇవ్వకుండా అధికార పార్టీ షాకిచ్చింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. కాగా, కేసీఆర్ సభకు హాజరు కాలేదు.
కాంగ్రెస్ ఆందోళన
రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. భూసేకరణ చట్ట సవరణ కంటే ముందే మిర్చి రైతుల సమస్యలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు ఆందోళన తెలిపారు. దీంతో సవరణ ఆమోదం సమయంలో గందరగోళం చెలరేగింది.
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్లకార్డులు చించి వేశారు. ఓ సమయంలో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. స్పీకర్కు రక్షణగా మార్షల్స్ సభలోకి వచ్చారు.
మార్షల్స్, కాంగ్రెస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. ఈ గందరగోళం మధ్య భూసేకరణ సవరణ చట్టానికి ఆమోదం తెలిపారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి కార్యాలయంలో భేటీ అయ్యారు.