కొత్త జిల్లాల ట్విస్ట్, తెరపైకి మరో 2: ఇది కేసీఆర్ లక్కీ నెంబర్!
హైదరాబాద్: దసరా రోజున తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సిద్దిపేట, మెదక్ కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని చెప్పారు.
మంత్రులు, శాసనసభాపతి, మండలి ఛైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర జిల్లాలను ప్రారంభిస్తారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలన్నారు. ఎవరెవరు ఏయే కార్యాలయాన్ని ప్రారంభించాలో జాబితా తయారు చేయాలన్నారు.
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పనిచేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, అవసరమైతే శాఖాపరమైన కమిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లా కేంద్రంలో తొలి రోజు నుంచే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పని చేయాలని, అలాగే కొత్త మండలాల్లో కూడా పోలీసు స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాలను నడపాలన్నారు.
వీలైనంత వరకు ప్రతి రెవెన్యూ డివిజన్లో ఆర్డీవోతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి ఉండాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంగళవారం తన నివాసంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
తెరపైకి మరో రెండు జిల్లాలు
కొత్తగా మరో రెండు జిల్లాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. నల్గొండ జిల్లాలోని వెనకబడిన ప్రాంతమైన దేవరకొండ జిల్లా కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దేవరకొండను జిల్లా చేయాలంటూ సాక్షాత్తూ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రభుత్వాన్ని కోరారని అంటున్నారు. దేవరకొండతోపాటు సికింద్రాబాద్ను జిల్లా చేయనున్నారనే ప్రచారం జరిగింది. దేవరకొండను జిల్లా చేయాలని, హైదరాబాదును విడగొట్టరాదని నాయిని కోరారు. అలాగే, హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపి ఇబ్రహీంపట్నం జిల్లాను ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా జోరుగానే ఉంది. జిల్లా డిమాండ్లు కోరిన ప్రాంతాల్లో ములుగు, ఇబ్రహీంపట్నం మినహా మిగతావన్నీ జిల్లాలు అయ్యాయి. దేవరకొండ, ఇబ్రహీంపట్నం కూడా అయితే.. జిల్లాల సంఖ్య 33కు చేరుకుంటుందంటున్నారు.
హైపవర్ కమిటీ
ఎంపీ కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఏడో తేదీన నాలుగు జిల్లాలతోపాటు కొత్తగా రెండు జిల్లాల పైనా నివేదిక ఇవ్వవచ్చునని చెబుతున్నారు. తాజా పరిణామాలతో జిల్లాల సంఖ్య 27 నుంచి 31కి చేరగా, మరో రెండింటితో కలిసి సంఖ్య 33కి చేరనుందంటున్నారు. అంతిమంగా కేసీఆర్ లక్కీ నెంబర్ 3+3=6కి చేరనుందని ప్రచారం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి.
కొత్త జిల్లాలు
గద్వాల, జనగామ, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాల కోసం జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. జిల్లా, డివిజన్, మండల సరిహద్దులు, జనాభా వంటి వివరాలతో సమగ్రంగా నివేదికను అందించాలని ఆదేశించింది. మారిన పరిణామాలతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన ఈ నెల 11వ తేదీన ఉదయం 10:41 గంటలకు విడుదల కానుంది. అదే సమయానికి సిద్దిపేట జిల్లా ప్రారంభం కానుంది.
ఆసిఫాబాద్కు కొమురం భీం పేరు
గోండు యోధుడు కొమురం భీం జన్మస్థలం జోడేఘాట్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తోందని, అందువల్ల ఆసిఫాబాద్ జిల్లాకే కొమురం భీం జిల్లా అని పేరు పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ (కొమురం భీం) జిల్లాలపై ఏడో తేదీ మధ్యాహ్నానికల్లా నివేదిక అందించాలని ఎంపీ కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీకి స్పష్టం చేశారు.
ఆదేశాలు
ప్రతిపాదిత 17 జిల్లాలతోపాటు జనగామ, గద్వాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉన్నందున అన్నిచోట్లా అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు తదితర విషయాలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లా డిమాండ్ల పరిశీలనకు అత్యవసర సమావేశాలు నిర్వహించుకొని వేగంగా ప్రక్రియను ముగించాలని హైపవర్ కమిటీని కోరారు.
రెవెన్యూ డివిజన్
ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నందున కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనలు పరిశీలించాలని ఆదేశించారు. దీనిపై జిల్లా మంత్రులతో పాటు అధికారులతో చర్చలు జరిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్, మాడ్గుల, తలకొండపల్లితోపాటు కొత్తగా ఏర్పడే కడ్తాల మండలం ప్రతిపాదిత రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలో కలుస్తున్నాయి. కల్వకుర్తిలో కల్వకుర్తితోపాటు వెల్డండ మండలాలు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలోనే కల్వకుర్తిని ఏ విధంగా డివిజన చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దాంతో, ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించాలని సీఎం నిర్దేశించారు.