గవర్నర్ తీరుపై అసెంబ్లీలో తీర్మానం - సుప్రీంలో కేసు..!?
ముఖ్యమంత్రి కేసీఆర్ నో కాంప్రమైజ్. పతాక స్థాయికి చేరిన కేంద్రంతో పోరు. ఇప్పటికే వేడెక్కిన తెలంగాణ రాజకీయం. అసెంబ్లీ వేదికగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు. వచ్చే నెల జరగనున్న తెలంగాణ అసెంబ్లీ వేదికగా కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది. అందులో భాగంగా.. కేంద్రం రాష్ట్ర అప్పులపై విధించిన ఆంక్షలను ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్రాలతో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు పైన చర్చకు నిర్ణయించారు. అదే సమయంలో గవర్నర్ తీరు పైనా తీర్మానం చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.
అసెంబ్లీ వేదికగా టార్గెట్ కేంద్రం
కేంద్ర ప్రభుత్వ తీరును ఎత్తిచూపడానికి డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాల వేదికగానే కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎండగట్టేందుకు సిద్దం అవుతోంది. రాష్ట్రానికి వివిధ మార్గాల కింద రావాల్సిన నిధులను డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు డిసైడ్ అయింది. కేంద్ర సర్కారు విధించిన ఆంక్షల కారణంగా రూ.40 వేల కోట్ల మేర నష్టపోయామని తెలంగాణ మంత్రులు వివరిస్తున్నారు.
14, 15 ఆర్థిక సంఘాలు చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేయడం లేదనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రంపై సుప్రీంలో కేసు దిశగా..
అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన చర్చ చేపట్టనున్నారు. సభ్యులు కేంద్రం తీరును ఎండగడుతూ వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రభుత్వ నిర్ణమయం. అదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అసెంబ్లీ వేదికగా జరిగే చర్చను తీర్మానం రూపంలో కేంద్రానికి పంపాలని భావిస్తున్నారు. కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రాష్ట్రానికి 41 శాతం మేర నిధులు రావాల్సి ఉండగా.. ప్రత్యేక సెస్ల విధింపుతో రాష్ట్రాల వాటాను 29 శాతానికే పరిమితం చేస్తోందని రాష్ట్ర సర్కారు పలుమార్లు ప్రస్తావించింది.
రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటా అని, అయినా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దగా చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల పైన అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ - ఆర్దిక మంత్రి హరీష్ ప్రజలకు వివరించేందుకు నిర్ణయించారు. కేంద్ర ఆంక్షల కారణంగా రాష్ట్రం ఏ మేర నష్టపోయిందో వివరించనున్నారు. తీర్మాన కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోతే.. ఏ రకంగా అడుగులు వేయాలనే దాని పైన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
గవర్నర్ తీరుపై అసెంబ్లీలో తీర్మానం..??
అసెంబ్లీ వేదికగా గవర్నర్ పైన తీర్మానం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపని అంశంపైనా మరో తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి.. గవర్నర్ సమ్మతి కోసం పంపింది, ఇందులో ఒక్క జీఎస్టీ సవరణ బిల్లును మాత్రమే ఆమోదించిన గవర్నర్ మిగతా 7 బిల్లులనూ అప్పట్నుంచీ పెండింగ్లోనే పెట్టారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
ఆర్టికల్ 200లో ఉన్న 'యాజ్ సూన్ యాజ్ పాసిబుల్' అనే పదాన్ని తొలగించి, 30 రోజుల గడువు పెట్టేలా రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతోంది. ఈ గడువును విధిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలనే డిమాండ్తో మరో తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని.. దాన్ని కూడా కేంద్రానికి పంపాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. దీని పైన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.