లాక్డౌన్?: జనంతో కిక్కిరిసిన సిటీ మార్కెట్లు, జిల్లాల్లోనూ అంతే, పోలీసులు లాఠీలకు పనిచెప్తేనే వింటారా?
హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మే 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపునిచ్చింది. అయితే, జనం మాత్రం ఆ మినహాయింపును పట్టించుకోకుండా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్లో మార్కెట్లన్నీ జనాలతో కిటకిట
ఆదివారం కావడంతో హైదరాబాద్ తోపాటు కరీంనగర్, మరికొన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన ఉదయం 6 నుంచి 10 గంటల తర్వాత కూడా రోడ్లపై ఇష్టారీతిన తిరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు చేపల మార్కెట్లు, చికెన్, మటన్ దుకాణాల వద్ద భారీగా జనం గుమిగూడారు. ఇక భౌతిక దూరం లాంటి కరోనా నిబంధనలను గాలికొదిలేశారు.
కరోనా నిబంధనలు గాలికొదిలేశారు..
మరికొందరు ప్రజలైతే మాస్కులు కూడా సరిగా పెట్టుకోలేదు. కూకట్పల్లి-జగద్గిరిగుట్ట మార్గంలో ఉదయం నుంచే భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి చేరుకున్నారు. ముషీరాబాద్-రాంనగర్ చేపల మార్కెట్ కూడా జనంతో కిక్కిరిసిపోయింది. షాపుల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే అనుమతి ఉన్నప్పటికీ.. 10 గంటలు దాటినా జనం మాత్రం రోడ్లపైనే ఉన్నారు.
పోలీసులు లాఠీలకు పనిచెప్తేనే జనం వింటారా?
ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల తర్వాత కూడా రోడ్లపై తిరుగుతున్న జనాలు, షాపుల వద్దకు వచ్చిన పోలీసులు సమయం ముగిసిందని చెప్పారు. అయినా కదలని జనాలపై తమ లాఠీలకు పనిచెప్పారు. అప్పుడు గానీ, జనాల్లో కదలిక రాలేదు. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో జనాలంతా అక్కడ్నుంచి పరారయ్యారు. షాపులు కూడా మూతపడ్డాయి.
ఇలా అయితే కరోనా కట్టడి కష్టమేనంటూ నిపుణుల హెచ్చరిక
కరోనా మహమ్మారి కారణంగా రోజూ దేశంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రజలు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై వైద్య నిపుణులు, వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకుంటూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మే 12 నుంచి పది రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అంతకుముందు 10వేలు దాటిన కరోనా కొత్త కేసులు ఇప్పుడు 5వేల లోపే నమోదవుతున్నాయి. కాగా, లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి వలస కూలీలు, ఉపాధి కోసం వచ్చినవారంతా తిరిగి తమ స్వస్థలాలకు వెళుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారుతున్నాయి. గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సులు, ఇతర వాహనాలు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.