విషాదాంతమైన మరో ప్రేమ కథ: పెద్దలు 'నో' చెప్పడం ప్రేమికుల ఆత్మహత్య
వెన్నెల మరణంతో అప్పటికే తీవ్ర మనస్తాపానికి లోనైన రాజశేఖర్.. తనపై వస్తున్న ఆరోపణలకు మరింత క్రుంగిపోయాడు. ఈ బాధను భరించలేక వెన్నెల చనిపోయిన సరిగ్గా నాలుగు రోజులకు అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: తెలంగాణలో మరో ప్రేమ కథ విషాదాంతంగా ముగిసిపోయింది. తమ ప్రేమను పెద్దలు ధిక్కరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ వెంటనే ఆమెను ప్రేమించిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఇరు కుటుంబాల్లోను తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన కుంట రాజశేఖర్(26) డిగ్రీ పూర్తి చేసి కొన్నాళ్లు ఓ మొబైల్ కంపెనీలో స్థానిక మార్కెట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈ క్రమంలో తమ దూరపు బంధువైన వెన్నెలతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
ఇంతలో రాజశేఖర్ అనుకోకుండా సౌదీ వెళ్లాల్సి వచ్చింది. అతని తండ్రి కుంట రాజన్న పదేళ్లకు పూర్వం నుంచే సౌదీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్ కు కూడా అక్కడే ఓ జాబ్ చూశాడు. వెంటనే సౌదీకి రావాల్సిందిగా కబురుపెట్టడంతో రాజశేఖర్ విమానమెక్కేశాడు. రాజశేఖర్ సౌదీ వెళ్లినా.. ఇద్దరూ ఫోన్ ద్వారా నిత్యం టచ్ లో ఉండేవారు.
అదే సమయంలో వెన్నెల తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వెన్నెల మాత్రం రాజశేఖర్ నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఎంతకీ ఆమె మాట వినకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైంది. అటు రాజశేఖర్ కుటుంబ సభ్యులు కూడా వెన్నెలతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమను పెద్దవాళ్లతో ఒప్పించడానికి చాలా సమస్యలు ఎదుర్కొన్నారు.
అయితే తల్లిదండ్రుల ఒత్తిడి రోజురోజుకు ఎక్కువవుతుండటంతో.. గత మార్చి నెలలో వెన్నెల ఆత్మహత్య చేసుకుంది. ఆపై వెన్నెల ఆత్మహత్యకు రాజశేఖరే కారణమంటూ సోషల్ మీడియాలో కొంతమంది వదంతులు పుట్టించారు. వెన్నెల మరణంతో అప్పటికే తీవ్ర మనస్తాపానికి లోనైన రాజశేఖర్.. తనపై వస్తున్న ఆరోపణలకు మరింత క్రుంగిపోయాడు. ఈ బాధను భరించలేక వెన్నెల చనిపోయిన సరిగ్గా నాలుగు రోజులకు అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో వెన్నెల-రాజశేఖర్ ల ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ఇదిలా ఉంటే, రాజశేఖర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ జాగృతి సౌదీ అరేబియా విభాగం ఏర్పాట్లు చేసింది. స్వగ్రామంలో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు.