విషాదం: షార్జాలో తెలంగాణ వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం నెలకొంది. కోరుట్లకు చెందిన వ్యక్తి షార్జాలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల రవీంద్ర రోడ్డుకు చెందిన దేశవేని నర్సయ్య, రాధ దంపతుల రెండో కుమారుడు నవీన్(28) ఆరు నెలల క్రితం ఉపాధి కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జా నగరానికి వెళ్లాడు.
షార్జాలోని ఓ కంపెనీలో కారు వాషింగ్ చేసేపని చేస్తున్నాడు. మే 23న రాత్రి తన గదిలో నవీన్ భోజనం చేస్తుండగా.. కేరళకు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కత్తితో నవీన్ను పలుమార్లు పొడిచాడు.

తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని దుబాయ్ లోని భారత అధికారులు కోరుట్లలోని కుటుంబసభ్యులకు ఆదివారం రాత్రి తెలియజేశారు. దీంతో నవీన్ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది.