ఫ్లోరిడాలో దారుణం: స్టోర్లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఫ్లోరిడాలోని ఓ స్టోర్లోకి దుండగులు చొరబడి అతనిపై కాల్పులు జరిపారు. గోవర్ధన్ రెడ్డి ఆ స్టోర్లో మేనేజర్గా పని చేస్తున్నారు.
స్టోర్లోకి వచ్చిన దుండగులు గోవర్ధన్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికి అక్కడే చనిపోయారు. గాయాల పాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా గోవర్ధన్ రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడి డిపార్టుమెంటల్ స్టోర్స్లో మేనేజర్గా పని చేస్తున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 గం.లకు స్టోర్లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. మరో గంటన్నరలో స్టోర్ మూసేసి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కాల్పులకు తెగబడిన దుండగుల్ని నల్లజాతీయులుగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గోవర్ధన్ రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ ఉప్పల్లో ఉంటున్నారు. ఆయన మృతి విషయం తెలిసి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గోవర్ధన్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి. అతను రిటైర్డ్ ఆర్మీమెన్. తల్లి పద్మ. ఆమె గృహిణి.