కొట్లాడితేనే హక్కులు సాధ్యం.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, కానీ.. ఈటల ఏమన్నారంటే..!
హైదరాబాద్ : ఓబీసీలంతా ఏకతాటిపై నిలిచి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. హక్కులు, రిజర్వేషన్లు అమలు కావాలంటే ఓబీసీలంతా ఏకం కావాలని కోరారు. ఓబీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
ఓబీసీలంతా కలిసికట్టుగా ముందుకు సాగి 27 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలని కోరారు. కొట్లాడితేనే హక్కులు వస్తాయని చెప్పుకొచ్చారు.ఓబీసీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టిన డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఓబీసీ జన గణన లెక్క తేల్చండి
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం 4వ జాతీయ ఓబీసీల మహాసభను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా 60 కోట్లకు పైగా ఉన్న ఓబీసీ జనాభా లెక్క తేల్చాలని ఓబీసీ మహాసభ తరపున డిమాండ్ చేశారు పలువురు నేతలు. ఓబీసీలకు రాజ్యాధికారం రావాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఓబీసీల జన గణన చేయనిపక్షంలో రెండో స్వాతంత్య్ర సమరాన్ని చూడాల్సి వస్తుందన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఓబీసీల సంక్షేమానికి కృషి చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. ఆ మేరకు ఓబీసీ మహాసభలో ఆవిష్కరించారు. ఆ పోర్టల్లో ఓబీసీల హక్కులు, రాజ్యాంగం కల్పించిన ఫలాలు, ఇతర వివరాలు పొందుపరిచారు.
జూనియర్
డాక్టర్ల
ధర్నా..
హీరో
రాజశేఖర్
మద్దతు..
కోదండరాం
సైతం..!
27 శాతం రిజర్వేషన్లు.. అయినా అమలయ్యేది 6-11 శాతమే : ఈటల
ఓబీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చని అన్నారు ఈటల రాజేందర్. అంబేద్కర్, పూలే చెప్పినట్లుగానే జాతికి జ్ఞానం వస్తేనే చైతన్యం వస్తుందని, ఆ విధంగా కలిసికట్టుగా ముందుకు సాగి 27 శాతం రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కొట్లాడితేనే హక్కులు సంక్రమిస్తాయని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అన్యాయం జరుగుతోందని ఓబీసీలు ఎందుకు ప్రశ్నిస్తున్నారో నాయకులు ఒకసారి ఆలోచించాలని సూచించారు.
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని చట్టాలు చెబుతున్నా.. అవి కేవలం 6 నుంచి 11 శాతం వరకు మాత్రమే అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాల్గవ జాతీయ ఓబీసీ మహాసభలను హైదరాబాద్లో నిర్వహించడం తెలంగాణకే గర్వకారణమన్నారు. పోరాడితే పోయేదేముంది, బానిస సంకెళ్లు తప్ప అన్నట్లు ఓబీసీల హక్కుల కోసం కోట్లాడాలని పిలుపునిచ్చారు. 20, 30 ఏళ్లలో కులమత భేదాలు లేని భారతదేశం సాకారం కావాలని, రిజర్వేషన్లు అవసరమే లేని సరికొత్త భారత్ అవతరించాలని ఆకాంక్షించారు.
బీసీల మీద క్రిమిలేయర్ బలవంతంగా రుద్దారు..!
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఏ సామాజిక వర్గానికి లేనట్లుగా క్రిమిలేయర్ అంశం బీసీల మీద బలవంతంగా రుద్దారని మండిపడ్డారు. దేశ జనాభాలో 85 శాతం ఉన్న ఓబీసీల కోసం ఒక్క మంత్రిత్వశాఖ లేకపోవడం విడ్డూరమని అన్నారు. విద్య, ఉద్యోగ, ప్రమోషన్లలో కేంద్రం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్చేశారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు క్రిమిలేయర్ వల్ల ఉద్యోగాల్లో ఎంతో నష్టం జరుగుతోందన్నారు.
ఓబీసీ మహాసభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ దేవేందర్గౌడ్, తల్లోజు ఆచారి, హీరో సుమన్, ఆర్ నారాయణమూర్తి, మహదేవరాజ్ జానకర్, బాబన్ థైమ్వాడే, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.