సూర్యాపేట నుంచి తొలి మంత్రి, తొలి విద్యాశాఖ మంత్రి: ఎవరీ జగదీశ్ రెడ్డి?
నల్గొండ/హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిపొందిన జగదీష్ రెడ్డి మంగళవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. తెరాస ఆవిర్భావ సభ్యులు. సూర్యాపేట ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తొలిసారి, తాజాగా, మంగళవారం (18 ఫిబ్రవరి 2019) రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, సహకార శాఖల బాధ్యతలు కూడా తీసుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి మొదటి మంత్రి. జగదీశ్ రెడ్డి 2014లో మొదటిసారి, 2018లో రెండోసారి సూర్యాపేట నుంచి పోటీ చేసి గెలిచారు.
ఎవరీ జగదీశ్ రెడ్డి?
గుంటకండ్ల జగదీష్ రెడ్డి 1965 జూలై 18వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు చంద్రారెడ్డి, సావిత్రమ్మ. భార్య సునీత. కొడుకు వేమన్ రెడ్డి. కూతురు పేరు లహరి. నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారంలో జన్మించారు. 2001లో వివాహం అయింది. జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర్ డిగ్రీ కళాశాలలో (ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధి) 1985లో బి.ఏ. పూర్తి చేశారు. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజ్ (నాగార్జున విశ్వవిద్యాలయం పరిధి) నుండి లా చదివారు. లా తర్వాత నల్గొండ జిల్లా కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ప్రారంభ సభ్యులులో ఒకరిగా చేరారు.
రాజకీయ ప్రస్థానం
జగదీశ్ రెడ్డి 2001లో సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జిగా నియమించబడ్డారు. సిద్దిపేట ఉప ఎన్నికల ఇంచార్జిగా కూడా ఉన్నారు. 2002లో మహబూబ్ నగర్ పాదయాత్ర ఇంచార్జ్గా వ్యవహరించారు. నాడు జలసాధన (బ్రిగేడియర్) 45 రోజుల పాటు ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేసింది. 2003లో మెదక్ ఇంచార్జిగా వ్యవహరించారు. 2004లో సిద్దిపేట ఉప ఎన్నికల ఇచార్జిగా వ్యవహరించారు. అప్పుడు హరీష్ రావు పోటీ చేసి గెలుపొందారు. 2005లో సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జిగా వ్యవహరించారు. 2006లో కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికల ఇంచార్జిగా, 2008లో ముషీరాబాద్, ఆలేరు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఇంచార్జిగా, మెదక్ జిల్లా ఇంచార్జిగా వ్యవహరించారు.
ఎమ్మెల్యేగా గెలుపొందారు
జగదీష్ రెడ్డి 2009లో హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జిగా, 2011లో బాన్సువాడ నియోజకవర్గం ఉప ఎన్నికల ఇంచార్జిగా, 2012లో కొల్లాపూర్, పరకాల ఉప ఎన్నికల ఇంచార్జిగా, 2013లో నల్గొండ జిల్లా ఇంచార్జిగా వ్యవహరించారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో మెంబర్గా పని చేశారు. 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.