మంత్రి హరీశ్ రావుకు తప్పిన పెను ప్రమాదం: అడ్డొచ్చిన అడవిపంది, ఢీకొట్టిన కాన్వాయ్ కార్లు
హైదరాబాద్: తెలంగాణ మంతరి హరీశ్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ వస్తున్న సమయంలో సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో మంత్రి వాహనశ్రేణికి అడవి పంది అడ్డువచ్చింది. దీంతో కాన్వాయ్లోని వాహనాలన్ని ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ వెంట హరీశ్ రావు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత మంత్రి హరీశ్ రావు హైదరాబాద్కు పయనమయ్యారు.
ఈ క్రమంలో దుద్దెడ సమీపానికి చేరుకోగానే.. హరీశ్ రావు కాన్వాయ్కు అడ్డంగా అడవి పందులు వచ్చాయి. దీంతో ఓ పందిని ఢీకొన్ని కారు అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో వెనుకే వస్తున్న హరీశ్ రావు కారు ముందు కారును ఢీకొట్టింది. హరీశ్ రావు ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
అయితే మంత్రి హరీశ్ రావుకు ఎలాంటి గాయాలు కాలేదు. ముందు వాహనంలోని ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం మరో వాహనంలో హరీశ్ రావు హైదరాబాద్ బయల్దేరారు. కాగా, కాన్వాయ్ కారు ఢీకొనడంతో అడవి పంది అక్కడికక్కడే చనిపోయింది.