కరోనా వైరస్ బాధితుల కుటుంబీకులతో మంత్రి హరీష్ రావు: 40 మంది ఇంటికెళ్లారంటూ..!
సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డిలో కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కుటుంబ సభ్యులతో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమావేశం అయ్యారు. కరోనా వైరస్ బారిన పడిన వారికి తమ ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోందని, అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకుంటారని అన్నారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన 40 మంది కరోనా పేషెంట్లకు నయమైందని, వారంతా సంతోషంగా ఇళ్లకు వెళ్లారని చెప్పారు.
సంగారెడ్డిలో ఒకేరోజు ఏకంగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే. ఢిల్లీని స్వస్థలానికి చేరుకున్న వారిని పరీక్షల కోసం పంపగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. సంగారెడ్డి, అంగడిపేట, కొండాపూర్, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.వారిని వెంటనే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
జిల్లాలో ఒకేసారి ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హరీష్ రావు జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర భేటీని నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించారని గుర్తు చేశారు.
మోడీ మహా సంకల్పం: ఆదివారం రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు: ప్రధాని సంచలన పిలుపు
Recommended Video
ఈ సమవేశం ముగిసిన వెంటనే ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి నేరుగా జిల్లా ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. అక్కడే కరోనా పాజిటివ్ కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక దూరాన్ని పాటించారు. బాధితులను ఉద్దేశించి మైక్లో మాట్లాడారు. వైరస్ సోకినంత మాత్రాన ఎవరూ చనిపోరని అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, ఇప్పటిదాకా 40 మందికి నయమైందని చెప్పారు. అలాగే సంగారెడ్డి బాధితులు కూడా సంతోషంగా ఇంటికి వస్తారని చెప్పారు. వైరస్ పాజిటివ్ కుటుంబ సభ్యులతో ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీష్ రావు అన్నారు.