ఎయిడ్స్ అచ్చింది.. ఇళ్లల్లోకెళ్లి ఎళ్లకున్రి అంటున్రు: హరీష్రావుకు ఝలక్ ఇచ్చిన దుబ్బాక వాసి
సిద్ధిపేట్: తెలంగాణలో విస్తరిస్తోన్న కరోనా వైరస్..గ్రామస్థాయిలో ప్రజలను ఎంతగా భయాందోళనలకు గురి చేస్తోందనే విషయాన్ని వెల్లడించే ఉదంతం ఇది. దాని పేరు తెలియకపోయినా.. గడప దాటడానికి గ్రామీణులు జంకుతున్నారు. కరోనా వైరస్ను ఎయిడ్స్గా భావిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని, అందర్నీ చంపేస్తోందని భావిస్తున్నారు. అందుకే బయట ఎవరూ తిరగట్లేదని, ఇళ్ల వద్దే ఉంటున్నారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారో రైతు.
ఎయిడ్స్ వచ్చిందని, అందువల్లే ఎవరూ ఇళ్లల్లోంచి బయటికి రావట్లేదని చెప్పారు. ఆయన మాటలు విని హరీష్ రావు ఆశ్చర్యానికి గురయ్యారు. సిద్ధిపేట్ జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన కారులో దుబ్బాక మీదుగా వెళ్తోన్న సమయంలో తారసపడిన ఓ రైతుతో మాట్లాడారు. తన కారును ఆపి వేసి కొద్దిసేపు ఆయనతో ముచ్చట్లాడారు. 2000 రూపాయల పింఛన్, బియ్యం తెచ్చుకున్నావా? అని ప్రశ్నించగా దానికి పింఛన్ వచ్చిందని తెలిపారు.
ఎయిడ్స్ అచ్చింది.. ఇళ్లల్లోకెళ్లి ఎళ్లకున్రి అంటున్రు: హరీష్రావుకు ఝలక్ ఇచ్చిన దుబ్బాక వాసి#Telangana #HarishRao pic.twitter.com/BQVRNKQE8S
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2020
తన ఇంట్లో నలుగురు ఉంటారని చెప్పారు. అనంతరం వారి సంభాషణ లాక్డౌన్పైకి మళ్లింది. ఊరిలో ఏమనుకుంటున్రు అంటూ హరీష్ రావు ప్రశ్నించగా.. ప్రజలంతా భయంతో తిరుగుతున్నారని బదులిచ్చారు. ఏమొచ్చిందట అని వేసిన ప్రశ్నకు ఆ రైతు చెప్పిన సమాధానం విని హరీష్ రావు నవ్వు ఆపుకోలేకపోయారు. ఎయిడ్స్ వచ్చిందని ఇళ్లల్లోకెళ్లి ఎళ్లకున్రని అంటున్రు అని సమాధానం ఇచ్చారు. ఏమొచ్చిందంటున్రు అంటూ హరీష్ రావు రెండోసారి కూడా ప్రశ్నించగా.. అదే సమాధానం ఇచ్చారు ఆ రైతు. అక్కడికెళ్లి ఎయిడ్స్ వచ్చిందని, ఇళ్లల్లోకెళ్లి వెళ్లకుండ్రి అని చెబుతున్నారని చెప్పారు.
బయటికెళ్తున్రా ఎవరైనా అని హరీష్ రావు ప్రశ్నించగా.. అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారని, బయట తిరగడానికి భయపడుతున్నారని, ఏమీ చెప్పస్తలేదని అన్నారు. ఎప్పుడైనా చూసినవా పుట్టినప్పుటి నుంచి ఇసువంటివి అని అడగ్గా.. చూడలేదని సమాధానం చెప్పారు. మనుషులంతా సచ్చిపోతున్నారని, ప్రభుత్వం బియ్యం ఇస్తుందని, ఇంటి దగ్గరే ఉండాలని చెబుతున్నారని అన్నారు. ఆ రైతు కులం గురించి ప్రశ్నించారు హరీష్ రావు. ఏమిటోళ్లని అడగ్గా.. తెనిగోళ్లమని చెప్పారా రైతు.