సమర్థత, నమ్మకమే గిటురాయి .. క్యాబినెట్ లో మరోసారి అల్లోలకు చోటు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో గత క్యాబినెట్ లో పనిచేసిన నలుగురికి మాత్రమే అవకాశం లభించింది. సామాజిక సమీకరణాలు, వినయ, విధేయతలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ తన టీంను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. సమర్థమైన నాయకుడిగా .. సీఎం కేసీఆర్ కు నమ్మిన బంటుగా మెలగడమే ఆయన మరో అవకాశం వచ్చిందని చెప్పొచ్చు.
బాల్యం, విద్యాభ్యాసం
1949 ఫిబ్రవరి 16న అల్లోల చిన్నమ్మ నారాయణ రెడ్డి దంపతులకు జన్మించారు ఇంద్రకరణ్ రెడ్డి. ఐకే రెడ్డికి భార్య విజయలక్ష్మీ, కుమారుడు గౌతం, కూతరు పల్లవి ఉన్నారు. ఐకే రెడ్డిది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ చేశాక .. ఎల్ ఎల్ బీ చేశారు. తర్వాత కొద్దిరోజులు స్కూల్ లో టీచర్ గా కూడా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం
విద్యార్థి దశలోనే ఐకే రెడ్డికి రాజకీయాలపై అవగాహన ఏర్పడింది. 1981లో నిర్మల్ పంచాయతీ సమితికి జరిగిన ఎన్నికల్లో అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. తర్వాత టీడీపీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీడీపీ కన్వీనర్ గా మొదలైన రాజకీయ ప్రస్థానం .. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వరకు కొనసాగుతోంది. 1987లో ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ ఎన్నికై .. నాలుగేళ్లు విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో డీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించి ... టీచర్ల చేత ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం .. రహదారులు, పాఠశాల భవనాలు నిర్మించి మంచి పేరు దక్కించుకున్నారు. 1991లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 1992లో కాంగ్రెస్ పార్టీలో చేరి .. పీవీ నర్సింహారావు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. 1999 నుంచి నిర్మల్ అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు.
బీఎస్పీ టు టీఆర్ఎస్ ..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంద్రకరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీఎస్పీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత తన శిష్యుడు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి బీఎస్పీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సుస్థిరితకు అండగా నిలువడంతో .. క్యాబినెట్ లో చోటు కల్పించారు సీఎం కేసీఆర్. క్యాబినెట్ లో గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు ఇంద్రకరణ్ రెడ్డి. ఆలయాల పటిష్టతకు పాటుపడుతూనే ... పూజారులకు వేతనం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.
ఇంద్రకరణ్ కు వర్తించని సెంటిమెంట్
రాష్ట్రంలో దేవదాయశాఖ పోర్టు పోలియో చేపడితే తర్వాత గెలువారనే సాంప్రదాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది నేతల ఓడిపోయి .. ఉనికిలో లేకుండా పోయారు. వారిలో ఎం సత్యనారాయణ ఒకరు. వైఎస్ హయాంలో దేవదాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ... తర్వాత కాలంలో పత్తాలేకుండా పోయారు. ఈ క్రమంలోనే దేవదాయశాఖ అంటే నేతలు భయపడే పరిస్థితి నెలకొంది. కానీ దీనిపై కేసీఆర్, ఇంద్రకరణ్ పట్టించుకోకుండా ముందడుగు వేశారు. నిర్మల్ ప్రజలు కూడా ఆ సెంటిమెంట్ ను వమ్ముచేసి దేవదాయశాఖ మీద ఉన్న అపప్రదను తొలగించేశారు.
జెడ్పీ చైర్మన్ టు మినిస్టర్
ఉమ్మడి జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసిన ఐకే రెడ్డికి కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో సమర్థమైన నాయకుడిగా పేరుగడించారు. 1987లో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ వెంటనే 1991 ఆదిలాబాద్ నుంచి ఎంపీగా .. 1999, 2004, 2014, 2018 వరకు వరుసగా నాలుగుసార్లు నిర్మల్ ఎమ్మెల్యేగా గెలించారు. అంతకుముందు 2008 ఉప ఎన్నికలో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు.
జిల్లాలో తనదైన ముద్ర ..
వివాదరహితునిగా, సమర్థుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు ఇంద్రకరణ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం కన్వీనర్గా, తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. సీఎం కేసీఆర్కు నమ్మకస్తులలో ఒకరిగా కేబినెట్లో కొనసాగిన అల్లోల ... జిల్లాలో పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అంతేకాదు అసంతృప్తులను బుజ్జగించడంలోనూ కీ రోల్ పోషించారాయన.