చీప్ లిక్కర్: 2వేల కోట్లు నష్టమన్న మంత్రి జగదీశ్, టీఆర్ఎస్ నేతలచే తాగించడన్న రావుల
హైదరాబాద్: చీప్ లిక్కర్పై విపక్షాలు కావాలనే రాజకీయ చేస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మిర్యాలగూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సారా తాగి వేలాది మంది యువకులు చనిపోతున్నారు.
దానిని దృష్టిలో పెట్టుకొనే చీప్ లిక్కర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని తెలిపారు. చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2వేల కోట్లు నష్టమని చెప్పిన ఆయన అయినా సరే ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే చీప్ లిక్కర్ను అందిస్తున్నామన్నారు.
ఆయుష్షును పెంచే మద్యం పేరుతో తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. చీప్ లిక్కర్పై పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు టీడీపీ నేతలు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశమయ్యారు.
చీప్ లిక్కర్తో ప్రజల ఆయుష్షు పెరుగుతుందంటూ మంత్రి పద్మారావు చేసిన వ్యాఖ్యలను రావుల తీవ్రంగా తప్పుబట్టారు. ఆయుష్షు పెంచే చీప్ లిక్కర్ను ప్రజలపై రుద్దవద్దని దానిని టీఆర్ఎస్ నేతలకే పరిమితం చేయాలని హితవు పలికారు. చీప్ లిక్కర్కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1385 కొత్త బార్లు, 13వేల మద్యం ఔట్లెట్లు కొత్తగా తీసుకురానుందని, దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు.