మంత్రి పదవికి రాజీనామా చేస్తా: పాలేరుపై కెటిఆర్ సంచలనం
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతే తాను మంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధమని.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్కుమార్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి పరాజయం పర్యాయపదంగా మారిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. పాలేరు ఉప ఎన్నికలో తెరాస విజయం తథ్యమని దీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు, బాధ్యత ఏమీ లేదని.. ప్రతి ఎన్నికకు ఆ పార్టీ నేతలు కుంటిసాకులు వెతుక్కుంటున్నారని విమర్శించారు. పాలేరులో సానుభూతి పేరుతో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
పాలేరు అభివృద్ధి టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావుతోనే సాధ్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నియోజవకర్గంలోని సుబ్లేడ్లో కేటీఆర్ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ముందుందని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కారు, కరెంట్ కోసం సబ్స్టేషన్ల ముందు ధర్నా చేసేవారని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుతున్నాయని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మలను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఇక తేలాల్సింది మెజారిటీయేనని చెప్పారు. ఆదివారం పాలేరు టిఆర్ఎస్ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. పాలేరు ఉప ఎన్నిక 2006లో సీఎం కేసీఆర్ పోటీ చేసిన కరీంనగర్ ఉప ఎన్నికను తలపిస్తోందన్నారు. గతంలో ఎన్నికలొస్తే ఎవరు గెలుస్తారని అడిగేవారని కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు.
ఎక్కడ ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అందరికి తెలిసిపోయిందని వివరించారు. ప్రతిపక్ష నాయకులు కూడా ఎవరు గెలుస్తారని అడిగే ధైర్యం చేయలేక పోతున్నారని పేర్కొన్నారు.
అందుకే కారు గుర్తుకు ఓటు వేసి ఖమ్మం జిల్లా అభివృద్ధి బాధ్యతను వహిస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్తోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.