హైదరాబాద్లో మహిళా జర్నలిస్టుకు వేధింపులు: చైనీయుల్లా..కరోనా వైరస్ అంటూ: కేటీఆర్ సీరియస్..!
హైదరాబాద్: కరోనా వైరస్ సంగతేంటో గానీ.. దాని దెబ్బకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర వివక్షతకు గురవుతున్నారు. విద్యా, ఉద్యోగాల కోసమో.. జీవనోపాధి కోసమో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసించే ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల స్థానికులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.. కించపరుస్తున్నారు. దూషణలకు దిగుతున్నారు. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణం కొన్ని చోట్ల కనిపించింది. తాజాగా- హైదరాబాద్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం- ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు ముఖం చైనీయులను పోలి ఉండటమే. వందమందిలో నిల్చున్నా.. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఇట్టే పసిగట్టవచ్చు.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ యువతి చాలాకాలం నుంచి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఓ ప్రముఖ ఇంగ్ల దినపత్రికలో ఆమె కంటెంట్ ఎడిటర్గా పని చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన వారి ముఖాలు దాదాపుగా చైనీయులను పోలి ఉంటాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలతోె పోల్చి చూస్తే.. వారి ముఖ కవళికలు పూర్తి విభిన్నంగా, వైవిధ్యంగా కనిపిస్తుంటాయి. ఆ వైవిధ్యమే ఆ మహిళా జర్నలిస్టుకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
On my way to Medical shop today, at least 15 people called me corona virus. #CoronaVillains #21daysoflockdown
— Leemi Keche (@keche_leemi) March 25, 2020
చైనాలో జన్మించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టబెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశం పట్ల భారతీయుల్లో కొంత వ్యతిరేక భావం నెలకొందనే విషయం తాజాగా ఈ ఉదంతంగా వెల్లడైనట్టయింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువతే అయినప్పటికీ.. చైనీయులను పోలిన ముఖం ఉండటం వల్ల హైదరాబాద్లో కొందరు స్థానికులు ఆమెను అవహేళనకు గురి చేశారు. కరోనా వైరస్ వచ్చింది.. అంటూ ఆమెను ఆటపట్టించారు.
This is indeed repugnant, absolutely unacceptable. Request @TelanganaDGP to issue clear instructions to register cases on those who indulge in slander/abuse of fellow citizens
— KTR (@KTRTRS) March 27, 2020
I appeal to all citizens to be graceful, compassionate & show your best side at this hour of crisis 🙏 https://t.co/6lfhFbalOI
గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మెడికల్ షాప్కు వెళ్లిన తనను సుమారు 15 మంది హైదరాబాదీ యువకులు కరోనా వైరస్ అంటూ వెక్కిరించారని, అవహేళనకు గురి చేశారని ఆ మహిళా జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పొందుపరిచారు. దాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. ఈ ఘటన పట్ల కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించబోమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఏ దేశానికి చెందిన వారినైనా.. ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలనైనా కించపరిచే హక్కు గానీ, వారిని అవహేళనకు గురి చేసే అధికారం గానీ ఎవ్వరికీ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.