దేశంలో ఉత్తమ ఐటీ మంత్రిగా కేటీఆర్: రెండోసారి స్కోచ్ అవార్డు, తెలంగాణ బెస్ట్ స్టేట్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)కు మరో అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా కేటీఆర్ నిలిచారు. ఈ మేరకు స్కోచ్ గ్రూప్.. మంత్రి కేటీఆర్ కు ప్రశంసా పత్రం అందించింది.
ఉత్తమ మంత్రి కేటీఆర్, ఉత్తమ స్టేట్ తెలంగాణ
2020 సంవత్సరంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్గా ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ వెల్లడించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు స్కోచ్ గ్రూప్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కేటీఆర్కు అందజేశారు. రాష్ట్రానికి రెండు అవార్డు లభించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
కరోన్ టైంలోనూ ఉత్తమ సేవలకే ఈ అవార్డు.. కేటీఆర్కు రెండోసారి
కరోనా సంక్షోభంలోనూ మెరుగైన ప్రజా సేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికతను విరివిగా వినియోగించుకుంది. 2016లో కూడా మంత్రి కేటీఆర్ స్కోచ్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే రెండు సార్లు స్కోచ్ అవార్డు దక్కించుకున్న ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ రికార్డు సృష్టించారు. స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ మంత్రి కేటీఆర్ తోపాటు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఐటీ సేవలను అందించడం కొనసాగించాలని చెప్పారు. కరోనా కాలంలో ఐటీ సేవలను విస్తృతంగా వినియోగించారని అభినందించారు.
ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్కు ఇటీవలే స్కోచ్ అవార్డు
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎంగా స్కోచ్ అవార్డు అందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గవర్నెన్స్ విభాగంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. స్కోచ్ గ్రూప్ మనదేశంలో ఫైనాన్స్, టెక్నాలజీ, ఎకనామిక్స్, సాంఘిక రంగాల్లో అత్యున్నత స్వతంత్ర పౌర పురస్కారాలను ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తుంది. భారత్ను మరింత మెరుగైన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రజలు, ప్రాజెక్టులు, సంస్థలకు ఈ పురస్కారాలను అందజేస్తుంది.